‘కానుక’ ఇస్తారని..

ABN , First Publish Date - 2021-03-05T05:26:15+05:30 IST

వైఎస్‌ఆర్‌ పెళ్లి కానుక కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూపులే మిగులుతున్నాయి. ఒకటి..రెండు నెలలు కాదు. రెండు సంవత్సరాల నుంచి కొత్త దంపతులు నిరీక్షిస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన యువతిని వివాహం చేసుకున్న వారికి గత ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుక కింద ఆర్థిక సాయం అందజేసేది.

‘కానుక’ ఇస్తారని..

వైఎస్‌ఆర్‌ పెళ్లి కానుక కోసం కొత్త జంటల ఎదురుచూపు 

2019 మార్చి నుంచి మంజూరు కాని వైనం

కలెక్టరేట్‌, మార్చి 4: వైఎస్‌ఆర్‌ పెళ్లి కానుక కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూపులే మిగులుతున్నాయి. ఒకటి..రెండు నెలలు కాదు. రెండు సంవత్సరాల నుంచి కొత్త దంపతులు నిరీక్షిస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన యువతిని వివాహం చేసుకున్న వారికి గత ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుక కింద ఆర్థిక సాయం అందజేసేది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పథకాన్ని వైఎస్‌ఆర్‌ పెళ్లి కానుకగా నామకరణం చేసింది. అదే సమయంలో ఆర్థిక సాయాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. కానీ ఇంతవరకూ నూతన దంపతులకు ఒక్క పైసా కూడా నిధులు విడుదల చేయలేదు. 2019 మార్చి నెల నుంచి నిధులు మంజూరు కాలేదు. గత ప్రభుత్వ హయంలో వివాహం చేసుకున్న లబ్దిదారులకు (బీసీ) రూ.35వేలు, బీసీల్లో కులాంతర వివాహాలు చేసుకుంటే రూ.50వేలు (ఎస్‌సీ, ఎస్‌టీ), రూ.75వేలు, దివ్యాంగులకు లక్ష రూపాయలు చొప్పున మంజూరు చేసింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీసీలకు రూ 50వేలు, ఎస్‌సీ, ఎస్‌టీలకు రూ.75వేలు, దివ్యాంగులకు రూ.1.50లక్షలు చొప్పున అందజేస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించిన జీవో జారీ చేయలేదు. 

జిల్లా వ్యాప్తంగా వివాహం చేసుకున్న నిరుపేద నూతన దంపతులు స్థానిక మండల కేంద్రాల్లో ఉన్న వెలుగు కార్యాలయంలో 2020 ఫిబ్రవరి వరకూ రిజిస్ర్టేషన్‌  చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులు యథావిధిగా ఉన్నాయి. గత ఏడాది మార్చి నుంచి వైఎస్‌ఆర్‌  కానుక రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ నిలిచిపోయిందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో కొత్తగా వివాహం చేసుకున్నవారు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా లేదు. పాతవారంతా ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందా? లేదా? అనేది తెలియక సందేహం వ్యక్తం చేస్తున్నారు.  ఇదే విషయమై డీఆర్‌డీఏ పీడీ సుబ్బారావు వద్ద ప్రస్తావించగా వైఎస్‌ఆర్‌ పెళ్లి కానుకకు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎటువంటి జీవో జారీ చేయలేదని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం కోసం చూస్తున్నామని వెల్లడించారు. 



Updated Date - 2021-03-05T05:26:15+05:30 IST