కూతురికి పెళ్లి ప్రయత్నాలు.. ఆమెను ఇంట్లోనే ఉంచి బంధువుల ఇంటికెళ్లిన తల్లిదండ్రులు.. తిరిగొచ్చాక ఇంట్లో షాకింగ్ సీన్
ABN , First Publish Date - 2021-11-17T12:50:11+05:30 IST
ఇంట్లో తన కూతురి పెళ్లి హడావుడి ఉండగా.. పనిమీద ఆ తండ్రి బయటికి వెళ్లి వచ్చాడు. అంతలోనే తన కూతురు శవమై కనపడింది. ఈ ఘోరం ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బిలాస్ పూర్ నగరంలో జరిగింది...
ఇంట్లో తన కూతురి పెళ్లి హడావుడి ఉండగా.. పనిమీద ఆ తండ్రి బయటికి వెళ్లి వచ్చాడు. అంతలోనే తన కూతురు శవమై కనపడింది. ఈ ఘోరం ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బిలాస్ పూర్ నగరంలో జరిగింది.
బిలాస్పూర్ నగరంలో ఇమ్లీబాటా ప్రేదేశంలో సుఖ్దేవ్(58) తన భార్య, కూతురు ప్రీతి(19)తో నివాసముంటున్నాడు. సుఖ్దేవ్కు మరో ముగ్గురు కొడుకులు కూడా ఉన్నారు. వారంతా అదే వీధిలో పొరుగునే నివాసముంటున్నారు. కొడుకులందరికీ వివాహం అయింది. ఇక ప్రీతికి కూడా సంబంధం కుదిరింది. కూతురి పెళ్లి ఏర్పాట్ల పనుల్లో సుఖ్దేవ్ ఉన్నాడు.
అలా గత సోమవారం ప్రీతి తల్లి తన కొడుకుల వద్దకు పొరుగు ఇంటికి వెళ్లగా.. ప్రీతి ఇంట్లో ఒంటరిగా ఉంది. సాయంత్రం సుఖ్దేవ్ ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ తలుపులు లోపలి నుంచి లాక్ చేసి ఉన్నాయి. ఎంతసేపు తట్టినా తలుపులు తెరుచుకోకపోవడంతో సుఖ్దేవ్ పక్కనే ఉన్న తన కొడుకులకు కబురు పంపించాడు. వారంతా వచ్చి తలుపులు పగల కొట్టి లోపలికి వెళ్లి చూడగా.. ప్రీతి శవం గదిలో వేలాడుతూ ఉంది. ఆమె చేతికి బ్లేడుతో కొసుకున్నట్లు రక్తపు మరకులు కూడా ఉన్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేశారు. ప్రీతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందా?.. లేక మరెవరో ఆమెను హత్య చేశారా? అనే కోణంలో పరిశీలిస్తున్నారు. ప్రీతి శవాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. కానీ ప్రీతి చనిపోయే కొంత సమయం ముందు ఆ వీధిలో ఒక సంఘటన జరిగింది. దాని గురించి ఇరుగుపొరుగు వారు పోలీసులకు చెప్పారు.
చనిపోయే ముందు ప్రీతిని అదే వీధిలో ఉన్న ఛోటు అనే యువకుడు రోడ్డు మీద పట్టుకొని కొట్టాడు. ఆమె జుట్టుని లాగి పట్టుకొని ఈడ్చాడు. ఆ సమయంలో ప్రీతి కుటుంబ సభ్యులెవరూ లేరు. గతంలో ప్రీతిని ఛోటు వెంటబడి వేధించేవాడని పోలీసులకి తెలిసింది. ఆమెకు పెళ్లి సంబంధం కుదరడంతో ఆ రోజు రోడ్డు మీద కొట్టాడని చూసిన వారు పోలీసులకు తెలిపారు.
ప్రస్తుతం పోలీసులు ప్రీతి మరణం కేసుని హత్య కోణంలో విచారణ చేస్తున్నారు. పరారీలో ఉన్న ఛోటు కోసం గాలిస్తున్నారు.