మోదీకి గట్టి గుణపాఠం : టీఎంసీ

ABN , First Publish Date - 2021-05-02T20:19:45+05:30 IST

పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీలో విజయోత్సాహం ఉరకలేస్తోంది

మోదీకి గట్టి గుణపాఠం : టీఎంసీ

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీలో విజయోత్సాహం ఉరకలేస్తోంది. శాసన సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా వెలువడుతున్న ఫలితాలు ఆ పార్టీకి మూడోసారి ఘన విజయం ఖాయమని స్పష్టం చేస్తున్నాయి. ఆదివారం ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లడవుతున్న సమయంలో టీఎంసీ సెక్రటరీ జనరల్ పార్థ ఛటర్జీ మాట్లాడుతూ, బెంగాలీలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి గట్టి గుణపాఠం చెప్పారన్నారు. ముఖ్యమంత్రి మమత బెనర్జీపై పదే పదే దాడి చేసినందుకు సరైన సమాధానం చెప్పారన్నారు. 


ఈసారి బీజేపీకి 200కు పైగా స్థానాలు వస్తాయని నినదించినవారి ముఖాలు ఎలా ఉంటాయో చూడాలనుకుంటున్నానని పార్థ ఛటర్జీ చెప్పారు.  ప్రజలు మమత బెనర్జీకి మద్దతుగా నిలిచారన్నారు. ఆమెను అవమానిస్తూ వ్యాఖ్యలు చేసినవారికి గుణపాఠం చెప్పారన్నారు. తాము సమైక్యత, అభివృద్ధి గురించే అన్ని వేళలా మాట్లాడామని చెప్పారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో మమత తన ప్రాణాలను పణంగా పెట్టి పని చేశారన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఆమె అవిశ్రాంతంగా కృషి చేశారన్నారు. ఈ కృషికి ఫలితం నేటి ఎన్నికల ఫలితాల్లో కనిపిస్తోందని చెప్పారు. 


Updated Date - 2021-05-02T20:19:45+05:30 IST