బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో టీఎంసీ నేతపై దాడి

ABN , First Publish Date - 2021-10-22T22:28:15+05:30 IST

టీఎంసీకి చెందిన సుష్మితా దేవ్ అనే ఎంపీ కారుపై శుక్రవారం కొంత మంది దాడికి పాల్పడ్డారు. కారుపై విధ్వంసం సృష్టించి అద్దాలు పగలగొట్టారు. అయితే కొంత మంది ప్రైవేటు ఉద్యోగుల సహాయంతో ఆమె అక్కడి నుంచి తప్పించుకోగలిగారు..

బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో టీఎంసీ నేతపై దాడి

అగర్తలా: పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య చాలా కాలంగా అనేక వివాదాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదాలు ఒక్కోసారి భౌతిక దాడులకు, అల్లర్లకు కూడా దారి తీస్తున్నాయి. కొన్నిసార్లు ఇరు పార్టీల కార్యకర్తలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా సంభవిస్తున్నాయి. అయితే ఇరు పార్టీల మధ్య వివాదం రాష్ట్రాల సరిహద్దులు దాటిందా అనే అనుమానాలు కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. తాజాగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న త్రిపురలో టీఎంసీ నేతపై దాడి జరిగింది. ఎప్పటిలాగే బీజేపీనే తమపై దాడికి పాల్పడిందని టీఎంసీ అంటోంది. అయితే వాస్తవాలు వెల్లడి కాలేదు కానీ, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో టీఎంసీ నేతపై దాడి జరగడాన్ని మిగతా పార్టీ నేతలు ఇలాగే భావిస్తున్నారు.


టీఎంసీకి చెందిన సుష్మితా దేవ్ అనే ఎంపీ కారుపై శుక్రవారం కొంత మంది దాడికి పాల్పడ్డారు. కారుపై విధ్వంసం సృష్టించి అద్దాలు పగలగొట్టారు. అయితే కొంత మంది ప్రైవేటు ఉద్యోగుల సహాయంతో ఆమె అక్కడి నుంచి తప్పించుకోగలిగారు. టీఎంసీ ప్రచార వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. కాగా, ఈ విషయమై టీఎంసీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘సుష్మిత దేవ్ సహా మరో పది మంది టీఎంసీ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు అంతాలీ బజార్‌ సమీపంలో మద్యాహ్నం 1:30 గంటలకు దాడి చేశారు. కార్లను ధ్వంసం చేసి టీఎంసీ పార్టీ కార్యకర్తలపై భౌతిక దాడికి దిగారు. గాయపడ్డ వారిలో మహిళా కార్యకర్తలు కూడా ఉన్నారు’’ అని ఫిర్యాదులో టీఎంసీ పేర్కొంది. టీఎంసీపై జరిగిన దాడి కిరాతకమైందని, త్రిపుర ప్రజలు దీనికి త్వరలోనే జవాబు ఇస్తారని మరో ప్రకటనలో టీఎంసీ పేర్కొంది.

Updated Date - 2021-10-22T22:28:15+05:30 IST