కాంగ్రెస్‌పై మమత బెనర్జీ అత్యంత ఘాటు విమర్శలు

ABN , First Publish Date - 2021-10-30T19:55:25+05:30 IST

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్

కాంగ్రెస్‌పై మమత బెనర్జీ అత్యంత ఘాటు విమర్శలు

పనాజీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ కాంగ్రెస్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌కు రాజకీయాల మీద శ్రద్ధ లేనందువల్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రమే మరింత శక్తిమంతుడు కాబోతున్నారని దుయ్యబట్టారు. గోవాలో శనివారం జరిగిన టీఎంసీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 


మమత బెనర్జీ పనాజీలో కొందరు విలేకర్లతో మాట్లాడుతూ, కాంగ్రెస్‌కు రాజకీయాల మీద శ్రద్ధ లేకపోవడం వల్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రమే మరింత బలపడుతున్నారని, ఆ పార్టీ నిర్ణయాలు తీసుకోలేకపోతోందని, ఫలితంగా దేశం ఇబ్బందులు పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల మీద కాంగ్రెస్‌ శ్రద్ధ చూపించడం లేదని, అందువల్ల తాను ఇప్పుడే అన్ని విషయాలు చెప్పలేనని తెలిపారు. ఆ పార్టీ వల్లే మోదీ మరింత బలపడబోతున్నారని అన్నారు. ఒకరు నిర్ణయం తీసుకోలేకపోతే, దానివల్ల దేశం ఎందుకు బాధపడాలని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు గతంలో ఓ అవకాశం వచ్చిందని, అప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటానికి బదులు పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీపై పోటీ చేసిందన్నారు. 


గోవా శాసన సభ ఎన్నికలు వచ్చే ఏడాది ప్రారంభంలో జరగబోతున్నాయి. గోవాలో 40 శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటన్నిటిలోనూ పోటీ చేయబోతున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మమత బెనర్జీ మాట్లాడుతూ, ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. భారత దేశ సమాఖ్య వ్యవస్థ పటిష్టంగా ఉండాలన్నారు. రాష్ట్రాలను బలోపేతం చేయాలని చెప్పారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే, కేంద్రం బలంగా ఉంటుందన్నారు. 


పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఎన్నికల వ్యూహాలను రచించిన ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం గోవాలో కూడా ఆ పార్టీకి సాయపడుతున్నారు. ప్రశాంత్ కిశోర్ ఇటీవల మాట్లాడుతూ, భారత దేశ రాజకీయాల్లో కేంద్ర స్థానంలో బీజేపీ ఉంటుందన్నారు. ఓడినా, గెలిచినా, మొదటి 40 ఏళ్ళలో కాంగ్రెస్ ఏ విధంగా ఉండేదో, అదేవిధంగా ఇప్పుడు బీజేపీ ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా 30 శాతం ఓట్లను ఎప్పుడైతే సాధించారో, త్వరగా బయటకు పోయే అవకాశం లేదన్నారు. 


Updated Date - 2021-10-30T19:55:25+05:30 IST