ప్రాణంతీసిన టిక్టాక్ ప్రేమాయణం..
ABN , First Publish Date - 2020-07-12T18:06:06+05:30 IST
టిక్టాక్ ప్రేమాయణం ఓ యువకుడి ప్రాణం బలితీసుకుంది..
మూడు నెలలుగా డోన్కు చెందిన వితంతువుతో పరిచయం..
తల్లిదండ్రులు మందలించటంతో ప్రియుడి ఆత్మహత్య
అనంతపురం(ఆంధ్రజ్యోతి): టిక్టాక్ ప్రేమాయణం ఓ యువకుడి ప్రాణం బలితీసుకుంది. నగర శివారులోని పిల్లిగుండ్లకాలనీకి చెందిన ఈడిగ ముత్యాలప్ప (21).. వితంతువుతో ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించలేదన్న మనస్తాపంతో శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ముత్యాలప్ప స్థానికంగా వాటర్ సర్వీసింగ్ బాయ్గా పనిచేస్తుండేవాడు. మూడు నెలల కిందట కర్నూలు జిల్లా డోన్కు చెందిన ఓ వితంతువుతో టిక్టాక్లో పరిచయం ఏర్పడింది. ఆమె భర్త ఇటీవల మృతిచెందాడు. ఇద్దరూ తరచూ ఫోన్లో టిక్టాక్ చేసుకుంటుండేవారు.
అలా వారి మధ్య బంధం ప్రేమగా మారింది. వివాహం చేసుకోవాలని భావించారు. ఈక్రమంలో ఆమెను ముత్యాలప్ప రెండు రోజుల కిందట తన తల్లిదండ్రుల వద్దకు తీసుకురావటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెతో వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో ప్రియురాలు తనకు దక్కదని ముత్యాలప్ప మనస్తాపం చెందాడు. రూరల్ మండలంలోని ధర్మబిక్షంకాలనీ సమీపాన గల వేపచెట్టుకు ఉరేసుకుని, మరణించాడు. గమనించిన స్థానికులు.. రూరల్ పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐ మురళీధర్రెడ్డి, ఎస్ఐ నబీరసూల్ ఆత్మహత్య స్థలాన్ని పరిశీలించారు.మృతదేహాన్ని సర్వజనాస్పత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.