తల్లి సహా తిరుపతి వ్యాపారి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-12-02T06:06:38+05:30 IST

అప్పులు భారమై తల్లి సహా తిరుపతికి చెందిన ఓ వ్యాపారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం శ్రీకాళహస్తిలో చోటు చేసుకుంది.

తల్లి సహా తిరుపతి వ్యాపారి ఆత్మహత్యాయత్నం
చికిత్స పొందుతున్న బ్రహ్మాజీ

శ్రీకాళహస్తి, డిసెంబరు 1: అప్పులు భారమై తల్లి సహా తిరుపతికి చెందిన ఓ వ్యాపారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం శ్రీకాళహస్తిలో చోటు చేసుకుంది. వన్‌టౌన్‌ పోలీసుల వివరాల మేరకు.. తిరుపతికి చెందిన బ్రహ్మాజీ(40) ఇదే నగరం రాయలచెరువు రోడ్డులో చెప్పుల దుకాణం నిర్వహిస్తున్నారు. వ్యాపారాభివృద్ధి, కుటుంబ పోషణకు అప్పులు చేశారు. సకాలంలో వాటిని తీర్చలేక పోవడంతో ఆర్థిక ఇబ్బందులు అధికమయ్యాయి. దీంతో మనస్థాపానికి గురైన ఆయన తల్లి బేబి(62)తో కలసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు.. బుధవారం బ్రహ్మాజీ తల్లితో కలసి శ్రీకాళహస్తి వచ్చి ముక్కంటి దర్శనం చేసుకున్నారు. అనంతరం మూడవ గేటు వద్దకు చేరుకుని ఇద్దరూ నిద్రమాత్రలు మింగారు. అపస్మారకస్థితికి చేరుకున్న వీరిని స్థానికులు గుర్తించి వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ సంజీవకుమార్‌ ఘటనాస్థలానికి చేరుకుని బాధితులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల చికిత్సతో ఇద్దరూ కోలుకోగా, అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లు వెల్లడించారని పోలీసులు తెలిపారు. మెరుగైన వైద్యం బాధితులను రుయాస్పత్రికి తరలించామని చెప్పారు. 



Updated Date - 2021-12-02T06:06:38+05:30 IST