కరోనా నియంత్రణ చర్యల్లో తిరుపతికి ఫస్ట్ ర్యాంక్
ABN , First Publish Date - 2020-03-31T12:22:18+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలకు స్మార్ట్సిటీ మిషన్ ప్రకటించిన ర్యాంకుల్లో తిరుపతి
తిరుపతి, మార్చి30 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలకు స్మార్ట్సిటీ మిషన్ ప్రకటించిన ర్యాంకుల్లో తిరుపతి మొదటి స్థానం సాధించింది. రాష్ట్రంలోని మిగిలిన పట్టణాలతో పోలిస్తే స్మార్ట్సిటీల్లో వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు బాగున్నాయని స్మార్ట్సిటీ మిషన్ తన నివేదికలో కితాబునిచ్చింది.
అందులోనూ ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కరోనా నియంత్రణ చర్యలు అద్భుతంగా ఉన్నట్లు పేర్కొంది. స్మార్ట్ నగరాల పనితీరును బట్టి మూడు గ్రేడ్లుగా విభజించి అక్కడి సేవలను పరిశీలించి స్మార్ట్సిటీ మిషన్ ర్యాంకులు ప్రకటించింది. రాష్ట్రంలో విశాఖపట్నం, అమరావతి, కాకినాడ, తిరుపతి.. నాలుగు స్మార్ట్సిటీలు ఉండగా ఇందులో తిరుపతికి మొదటి ర్యాంక్ వచ్చింది. తిరుపతికి విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల ఇళ్ల వద్ద పక్కాగా మార్కింగ్ వేశారని, వారిపై ‘క్వారంటైన్’ పర్యవేక్షణ బాగుందని కితాబిచ్చింది. అలాగే ఇంటింటికి వెళ్లి నిత్యావసరాలు, సరుకులు అందజేస్తున్నారని పేర్కొంది.