తిరుపతి ఎస్పీని సస్పెండ్ చేయాలి
ABN , First Publish Date - 2020-10-18T09:05:27+05:30 IST
తిరుపతి ఎస్పీని సస్పెండ్ చేయాలి
రేప్ కేసు నిందితుడిని తప్పించారు
సీఎంకు సీబీఐ మాజీ డైరెక్టర్ లేఖ
అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): అత్యాచారం కేసులో నిందితుడు శిక్ష నుంచి తప్పించుకునేలా వ్యవహరించిన తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేశ్ రెడ్డిని సస్పెండ్ చేసి చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్కు సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు లేఖ రాశారు. తిరుపతి అర్బన్ ఎస్పీ పరిధిలో ఓ యువతి తనపై అత్యాచారం జరిగిందంటూ అక్టోబరు 3న పోలీసు స్టేషన్కు వెళితే తొమ్మిది రోజులపాటు పట్టించుకోకుండా నిందితుడైన మత ప్రబోధకుడి (పాస్టర్)కి మేలు జరిగేలా వ్యవహరించారని లేఖలో పేర్కొన్నారు. చివరికి స్థానికంగా నిరసనలు వెల్లువెత్తడంతో 12న ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ.. ఆ తర్వాత మూడు రోజులైనా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్ల నిందితుడు శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉందని, తక్షణమే తిరుపతి ఎస్పీని సస్పెండ్ చేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని కోరారు.