ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ అని నామకరణం

ABN , First Publish Date - 2021-12-16T16:05:30+05:30 IST

అమరావతి రైతుల బహిరంగ సభకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ అని..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ అని నామకరణం

తిరుపతి: అమరావతి రైతుల బహిరంగ సభకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ అని నామకరణం చేశారు. ప్రాంగణంలో ఘనంగా భూమి పూజ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తిరుచానూరు సమీపంలోని దామినీడు వద్ద ప్రయివేటు స్థలంలో సభ జరగనుంది. వివిధ పార్టీల అగ్రనేతలు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, వైసీపీ నర్సాపురం ఎం.పీ  రఘురామ కృష్ణంమరాజు, కాంగ్రెస్ పార్టీ నేతలు శైలజానాథ్, తులసి రెడ్డి, సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ, తదితర కీలక నేతలు బహిరంగ సభలో పాల్గొంటారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొనటంపై ఇవాళ 12 గంటలకు క్లారిటీ రానుంది. ఇంకా ప్రజా సంఘాల నేతలు పాల్గొంటారు.


మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా శుక్రవారం తిరుపతిలో అమరావతి రైతులు నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. తిరుపతి రూరల్‌ మండలం దామినీడు గ్రామంలో పిటిషనర్‌ సూచించిన ప్రైవేటు స్థలంలో మధ్యాహ్నం 1గంట నుంచి సాయంత్రం 6గంటల వరకు సభ నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. సభకు అనుమతి నిరాకరించడానికి పోలీసులు పేర్కొన్న కారణాలు సహేతుకంగా లేవని పేర్కొంది. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందనే కారణంతో అనుమతి నిరాకరించడం సరికాదని వ్యాఖ్యానించింది. ఆ పరిస్థితి తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టం చేసింది. 3 రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సభ నిర్వహించుకొనేందుకు అనుమతి నిరాకరించడం ప్రాథమిక హక్కులను హరించడమేనని తెలిపింది. సమస్యలపై ఉద్యమించడం, గొంతెత్తడం కూడా ప్రాథమిక హక్కేనని స్పష్టం చేసింది. పిటిషనర్‌ సంస్థ పేర్కొన్న స్థలంలో బహిరంగసభ నిర్వహించుకొనేందుకు అనుమతి ఇచ్చేలా తిరుపతి అర్బన్‌ ఎస్పీని ఆదేశించాలని  డీజీపీకి స్పష్టం చేసింది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు సహేతుకమైన ఆంక్షలు విధించవచ్చని పేర్కొంది.

Updated Date - 2021-12-16T16:05:30+05:30 IST