TTD: భక్తులకు టీటీడీ విజ్ఞప్తి
ABN , First Publish Date - 2022-09-19T01:32:54+05:30 IST
తిరుమల (Tirumala)లో ఈనెల 27 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వచ్చేవారికి అన్నప్రసాద వితరణ చేస్తున్నాం.
తిరుమల: ‘తిరుమల (Tirumala)లో ఈనెల 27 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వచ్చేవారికి అన్నప్రసాద వితరణ చేస్తున్నాం. అన్నదానం పేరిట ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులు విరాళాలు అడిగితే ఇవ్వకండి’ అంటూ భక్తులకు టీటీడీ (TTD) విజ్ఞప్తి చేసింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో అన్నదానం చేస్తామంటూ సికింద్రాబాద్కు చెందిన అనంతగోవిందదాస ట్రస్టు భక్తుల (Devotees) నుంచి విరాళాలు కోరడాన్ని టీటీడీ గుర్తించింది. దీనికోసం బ్యాంక్ అకౌంట్ నెంబరును కూడా ట్రస్టు అందుబాటులో ఉంచింది. ఈట్రస్టుతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఇలాంటి సంస్థలు, వ్యక్తుల మాటలు నమ్మవద్దని భక్తులను కోరింది. అక్రమంగా విరాళాలు సేకరించే ఇలాంటి ట్రస్టులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటనలో పేర్కొంది.
తిరుమలేశుడి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.నాగార్జున ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆయన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. ఈమేరకు రంగనాయక మండపంలో న్యాయమూర్తికి వేదపండితులు ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.