టైమ్స్ గ్రూప్ చైర్పర్సన్ ఇందు జైన్ కన్నుమూత
ABN , First Publish Date - 2021-05-14T08:19:09+05:30 IST
టైమ్స్ గ్రూప్ చైర్పర్సన్ ఇందు జైన్ ఇక లేరు. ఆమె వయసు 84 ఏళ్లు. కొవిడ్ సంబంధిత సమస్యలతో గురువారం ఆమె కన్నుమూశారు. జైన్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీతోపాటు పలువురు...
ముంబై: టైమ్స్ గ్రూప్ చైర్పర్సన్ ఇందు జైన్ ఇక లేరు. ఆమె వయసు 84 ఏళ్లు. కొవిడ్ సంబంధిత సమస్యలతో గురువారం ఆమె కన్నుమూశారు. జైన్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీతోపాటు పలువురు రాజకీయవేత్తలు, పరిశ్రమ దిగ్గజాలు, ఆత్యాధ్మిక గురువులు, స్నేహితులు నివాళులు అర్పించారు. 1999లో ఇందు జైన్ టైమ్స్ గ్రూప్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఆమె సారథ్యంలో గ్రూప్ సరికొత్త శిఖరాలను అధిరోహించింది. 2016లో పద్మభూషణ్తో సహా జైన్ ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. అంతేకాదు, మరెన్నో సంస్థలు, సంఘాలకు నేతృత్వం వహించారు.
దేశంలో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు, వృత్తి నిపుణులను ప్రోత్సహించేందుకు 1983లో ఏర్పాటైన ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్(ఎ్ఫఎల్ఓ)కు జైన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు. 1999 నుంచి భారతీయ జ్ఞానపీఠ్ ట్రస్ట్కు చైర్పర్సన్గానూ వ్యవహరించారు. భారతీయ భాషల్లో సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు ఇందు జైన్ మామగారు సాహు శాంతి ప్రసాద్ జైన్ ఈ ట్రస్ట్ను 1944లో ఏర్పాటు చేశారు. సామాజిక సేవా కార్యక్రమాల కోసం 2000 సంవత్సరంలో ఆమె టైమ్స్ ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు. దేశంలోని ప్రముఖ ఎన్జీఓల్లో ఒకటైన ఈ ఫౌండేషన్.. తుఫాన్లు, భూకంపాలు, వరదలు, విపత్తులతోపాటు ఇతర సంక్షోభాల్లో ఆర్థిక సాయం అందించేందుకు వీలుగా టైమ్స్ రిలీఫ్ ఫండ్ను నిర్వహిస్తోంది.