ఈ సారి పంద్రాగస్టు ప్రగతి భవన్‌లోనే!

ABN , First Publish Date - 2020-08-13T08:11:26+05:30 IST

పంద్రాగస్టు వేడుకలు ఈ సారి ప్రగతి భవన్‌లోనే జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు

ఈ సారి పంద్రాగస్టు ప్రగతి భవన్‌లోనే!

  • జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధుల పతాకావిష్కరణ
  • వేడుకల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించాలి
  • ఆదేశాలు జారీ చేసిన సీఎస్‌

హైదరాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): పంద్రాగస్టు వేడుకలు ఈ సారి ప్రగతి భవన్‌లోనే జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోయినా.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రగతి భవన్‌లోనే నిర్వహించవచ్చని తెలిసింది. సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లోనే పతాకావిష్కరణ చేస్తారని సమాచారం. వాస్తవానికి 2019 సంవత్సరపు గణతంత్ర ఉత్సవాలు సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండులో జరిగాయి. ఆ తర్వాత అన్ని ఉత్సవాలను నాంపల్లిలోని పబ్లిక్‌ గార్డెన్‌లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు 2019లో జూన్‌ 2న రాష్ట్రావతరణ ఉత్సవాలు, ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం పబ్లిక్‌ గార్డెన్‌లో జరిగాయి. ఈ సంవత్సరం గణతంత్ర ఉత్సవాలు కూడా  అక్కడే జరిగాయి. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో జూన్‌ 2న రాష్ట్రావతరణ ఉత్సవాలు మాత్రం ప్రగతి భవన్‌లో జరిగాయి. సీఎం కేసీఆర్‌ అక్కడే జెండాను ఆవిష్కరించారు. అలాగే ఈ నెల 15న స్వాతం త్య్ర దినోత్సవాన్ని కూడా ప్రగతి భవన్‌లోనే నిర్వహిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కరోనా తగ్గుముఖం పట్టకపోవడం, పంద్రాగస్టుకు పోలీసు పరేడ్‌ ఉండకపోవడం వంటి కారణాలతో ప్రగతి భవన్‌లోనే ఉత్సవాన్ని నిర్వహిస్తారని సమాచారం. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ 15న ఉదయం 10.30 గంటలకు జెండాను ఆవిష్కరిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. అయితే జెండావిష్కరణ ఎక్కడన్నదీ స్పష్టం చేయలేదు. మిగతా 32 జిల్లా కేంద్రాల్లో జెండాలను ఎగురవేసే మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధుల వివరాలను వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులను జారీ చేశా రు. వేడుకల సందర్భంగా కోవిడ్‌ నిబంధనలు పాటించాలని, జెండావిష్కరణకు పరిమిత సంఖ్యలో హాజరు కావాలని సూచించారు. 

Updated Date - 2020-08-13T08:11:26+05:30 IST