వరలక్ష్మీ వ్రతానికి వేళాయె
ABN , First Publish Date - 2022-08-04T05:30:00+05:30 IST
శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసేందుకు మహిళా భక్తులు సిద్ధమయ్యారు. పూజా సామగ్రి కొనుగోలు కోసం గురువారం మార్కెట్లకు క్యూ కట్టారు.
సన్నద్ధమైన మహిళా భక్తులు
పూజా సామగ్రి కొనుగోలుకు బారులు
విజయనగరం(ఆంధ్రజ్యోతి), ఆగస్టు4 : శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసేందుకు మహిళా భక్తులు సిద్ధమయ్యారు. పూజా సామగ్రి కొనుగోలు కోసం గురువారం మార్కెట్లకు క్యూ కట్టారు. వరలక్ష్మీ అమ్మవారిని నియమనిష్టలతో పూజిస్తే భోగభాగ్యాలు సమకూరుతాయని నమ్మకం. అందులోనూ శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందువచ్చే శుక్రవారం నాడే ఎక్కువగా వరలక్ష్మీ పూజ నిర్వహిస్తారు. ఇందుకోసం ఆలయాలను కూడా సిద్ధం చేశారు. మామిడి ఆకుల తోరణాలతో అలంకరించారు. పూజకు అవసరమైన పుష్పం, పత్రం, ఫలాలు, ఇతరాత్రా పూజా ద్రవ్యాల కొనుగోలుకు భక్తులు గురువారం మార్కెట్లకు బారులుతీరారు. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు ఒక్కసారిగా ధరలు పెంచేశారు. సాధారణ రోజుల్లో రూ.20 కే లభించే పూలు వంద రూపాయలకు విక్రయించారు. విజయనగరంలోని ఎంజీరోడ్డు, కన్యకాపరమేశ్వరీ గుడి, పైడితల్లమ్మ, గంటస్తంభం, పీడబ్ల్యూ మార్కెట్ తదితర ప్రాంతాలు కొనుగోలుదారులతో రద్దీగా కనిపించాయి. పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.