మహిళకు అసభ్యకర సందేశాలు.. టెస్టు కెప్టెన్సీకి టిమ్ పైన్ గుడ్‌ బై!

ABN , First Publish Date - 2021-11-19T22:03:24+05:30 IST

‘సెక్ట్సింగ్’ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా జట్టు టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

మహిళకు అసభ్యకర సందేశాలు.. టెస్టు కెప్టెన్సీకి టిమ్ పైన్ గుడ్‌ బై!

హోబర్ట్: ‘సెక్ట్సింగ్’ స్కాండల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా జట్టు టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. మార్చి 2018లో ఆస్ట్రేలియా జట్టుకు 46వ టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన 36 ఏళ్ల టిమ్ తన సహోద్యోగి అయిన ఓ మహిళకు అసభ్యకర సందేశాలు పంపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.


ఈ నేపథ్యంలో కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు తాజాగా విలేకరుల సమావేశంలో వెల్లడించాడు. ఇది చాలా కఠిన నిర్ణయమే అయినా తనకు, తన కుటుంబానికి, తమ జట్టుకు మాత్రం సరైన నిర్ణయమేనని అన్నాడు. 


ఆరోపణలు వచ్చిన తొలినాళ్లలో భార్య, కుటుంబ సభ్యులతో మాట్లాడానని, వారి క్షమాపణ, మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చెప్పాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ గతంలోలానే జట్టుపై పూర్తిగా దృష్టి పెడతానన్నాడు. ఈ ఘటన తమ ఆట ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు క్షమించాలని కోరాడు.


కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలన్న తన నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు నాయకత్వం వహించడం తన కెరియర్‌లోనే గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పాడు. కాగా, యాషెస్ సిరీస్‌కు ముందు పైన్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం ఆ జట్టుకు ఎదురుదెబ్బేనని అంటున్నారు.

Updated Date - 2021-11-19T22:03:24+05:30 IST