ముంబైని నిలబెట్టిన తిలక్‌వర్మ.. చెన్నై ఎదుట ఓ మోస్తరు లక్ష్యం

ABN , First Publish Date - 2022-04-22T02:59:39+05:30 IST

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల

ముంబైని నిలబెట్టిన తిలక్‌వర్మ.. చెన్నై ఎదుట ఓ మోస్తరు లక్ష్యం

ముంబై: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ముంబైకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.రెండు పరుగులకే కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ డకౌట్లుగా వెనుదిరిగారు. ఆదుకుంటారనుకున్న డెవాల్డ్ బ్రెవిస్ (4) కూడా చేతులెత్తేయడంతో ముంబై మరిన్ని కష్టాల్లో పడింది.


అయితే, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ జట్టును గాడినపెట్టే ప్రయత్నం చేశారు. ఇద్దరూ కలిసి సంయమనంతో ఆడుతూ స్కోరు పెంచుకుంటూ పోయారు. సూర్యకుమార్ 32 పరుగులు చేసి అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన కొత్త కుర్రాడు హృతిక్ షాకీన్ (25) అండగా తిలక్ వర్మ చెలరేగాడు.


బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 51 పరుగులు చేశాడు. చివర్లో ఉనద్కత్ 9 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 19 పరుగులు చేయడంతో జట్టు స్కోరు 155 పరుగులకు చేరుకుంది.  కీరన్ పొలార్డ్ 14 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో ముకేశ్ చౌదరి 3, బ్రావో 2 వికెట్లు తీసుకున్నారు.

Updated Date - 2022-04-22T02:59:39+05:30 IST