ట్రంప్ ప్రభుత్వంపై దావా వేసేందుకు సిద్దమైన టిక్‌టాక్

ABN , First Publish Date - 2020-08-09T07:32:36+05:30 IST

ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ అమెరికా ప్రభుత్వంపై దావా వేసేందుకు సిద్దమైంది.

ట్రంప్ ప్రభుత్వంపై దావా వేసేందుకు సిద్దమైన టిక్‌టాక్

వాషింగ్టన్: ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ అమెరికా ప్రభుత్వంపై దావా వేసేందుకు సిద్దమైంది. టిక్‌టాక్‌పై బ్యాన్ విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేస్తానంటూ గత వారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ టిక్‌టాక్ మాతృసంస్థ బైడ్‌డ్యాన్స్ మంగళవారం కాలిఫోర్నియా కోర్టులో దావా వేయనుంది. టిక్‌టాక్ అమెరికా ఆపరేషన్స్ కాలిఫోర్నియా నుంచే నిర్వహిస్తుండటంతో.. ఆ రాష్ట్రంలోనే దావా వేయాలని సంస్థ భావిస్తోంది. టిక్‌టాక్ వల్ల అమెరికా జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతోందని అమెరికా ప్రభుత్వం వాదిస్తోంది. అయితే దీనిపై కూడా బైట్‌డ్యాన్స్ చాలెంజ్ చేయనుంది. 45 రోజుల్లో టిక్‌టాక్ అమెరికా ఆపరేషన్స్‌ను మైక్రోసాఫ్ట్‌కు అప్పగించేలా ట్రంప్ ప్రభుత్వం బైట్‌డ్యాన్స్‌పై ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే ఇదే సమయంలో బైట్‌డ్యాన్స్ ఐర్లాండ్‌లో డేటా సెంటర్‌ను నెలకొల్పాలని నిర్ణయం తీసుకుంది. బీజింగ్‌లోని ప్రధాన కార్యాలయాన్ని కూడా యూరప్‌కు మార్చాలని యోచిస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఇలా చైనాకు దూరంగా జరిగేలా బైట్‌డ్యాన్స్ వ్యవహరిస్తోంది. ట్రంప్‌కు నిరాశ కలిగించేందుకు బైట్‌డ్యాన్స్ అనేక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తోంది. కాగా.. అమెరికాలో నాలుగు కోట్ల మంది టిక్‌టాక్ యాప్‌ను వినియోగిస్తున్నారు. టిక్‌టాక్ యాప్ ద్వారా అమెరికన్ల డేటాను బైట్‌డ్యాన్స్ చైనా ప్రభుత్వానికి అందజేస్తోందని అమెరికా ప్రభుత్వం, పలువురు నిపుణులు, న్యాయవాదులు మొదటి నుంచి వాదిస్తున్నారు. 

Updated Date - 2020-08-09T07:32:36+05:30 IST