రిలయన్స్ జియోతో టిక్టాక్ ఒప్పందం?
ABN , First Publish Date - 2020-08-13T20:25:19+05:30 IST
అమెరికాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న టిక్టాక్ మాతృసంస్థ బైట్డ్యాన్స్ తాజాగా భారత వ్యాపారాలపై..
న్యూఢిల్లీ: అమెరికాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న టిక్టాక్ మాతృసంస్థ బైట్డ్యాన్స్ తాజాగా భారత వ్యాపారాలపై దృష్టిపెట్టింది. భారత్లో తన షార్ట్ వీడియో మేకింగ్ యాప్ టిక్టాక్ వ్యాపారాన్ని రిలయన్స్ జియోకి కట్టబెట్టేందుకు సదరు చైనా కంపెనీ సిద్ధమైనట్టు సమాచారం. దేశంలో తన కార్యకలాపాలపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలోనే బైట్డ్యాన్స్ ఈ నిర్ణయం తీసుకుందని కంపెనీ అంతర్గత వర్గాలు చెప్పినట్టు టెక్ క్రంచ్ వెల్లడించింది. ‘‘గత నెలాఖరులోనే ఇరు కంపెనీలు ఈ దిశగా చర్చలు ప్రారంభించాయి. అయితే ఒప్పందంపై ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదు...’’ అని పేర్కొంది. అయితే దీనిపై బైట్డ్యాన్స్, రిలయన్స్ జియో ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. దేశంలో టిక్టాక్ వ్యాపారం 3 బిలియన్ డాలర్లకు పైనే ఉంటుందని అంచనా.
దేశంలో టిక్టాక్పై నిషేధం విధించడం, భవిష్యత్తు కార్యకలాపాలపై సందిగ్ధత నెలకొనడంతో కంపెనీ ఉద్యోగులు వేరే అవకాశాలపై దృష్టిపెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టిక్టాక్-జియో ఒప్పందంపై ఊహాగానాలు వస్తుండడం గమానార్హం. ప్రస్తుతం దేశంలో 2 వేలకు పైగా ఉద్యోగులు టిక్టాక్లో పనిచేస్తుండగా.. ఇప్పుడు కొత్తగా ఉద్యోగాల్లోకి ఎవరినీ తీసుకోవడం లేదు. దేశ భద్రతపై ఆందోళన వ్యక్తం కావడంతో టిక్టాక్ సహా 58 యాప్లపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే యాప్ను నిషేధించిన మరుసటి రోజు టిక్టాక్ సీఈవో కెవిన్ మేయర్ స్పందిస్తూ.. ‘‘ఉద్యోగులే మా కంపెనీకి అతిపెద్ద బలం. వారి క్షేమానికే అధిక ప్రాధాన్యం ఇస్తాం...’’ అని పేర్కొన్నారు. అయితే తాజాగా అమెరికాలో సైతం టిక్టాక్ మెడపై కత్తివేలాడుతుండడంతో కంపెనీ ఇచ్చిన భరోసా ఉద్యోగుల్లో పెద్దగా పనిచేయడం లేదని తెలుస్తోంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల్లో టిక్టాక్ వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్టు ఇటీవల మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. అయితే సెప్టెంబర్లోగా దీనిపై తుదినిర్ణయానికి రావాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెడ్లైన్ విధించారు.