ప్రత్తిపాడులో పులి కోసం కొనసాగుతున్న వేట
ABN , First Publish Date - 2022-06-05T16:27:02+05:30 IST
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పులి కోసం వేట కొనసాగుతోంది. బోన్లో దూడను ఎరగా పెట్టి పులిని బంధించేందుకు అధికారులు యత్నించారు.
కాకినాడ: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పులి కోసం వేట కొనసాగుతోంది. బోన్లో దూడను ఎరగా పెట్టి పులిని బంధించేందుకు అధికారులు యత్నించారు. అయితే బోన్ వరకు వచ్చి పెద్దపులి తృటిలో తప్పించుకుంది. సీసీ కెమెరాల్లో పెద్దపులి సంచారం వీడియో రికార్డయ్యాయి. ప్రత్తిపాడు మండలంలో 13 రోజులుగా పశువులను చంపి పెద్దపులి తింటోంది. ఒమ్మంగిలో మరో దూడను పులి చంపితిన్నది. దీంతో తీవ్ర భయాందోళనలో ప్రజలున్నారు. ప్రత్తిపాడు మండలంలో రెండు వారాలుగా పులి తిరుగుతోంది. నీటి వనరులు, చల్లదనం, వేటాడటానికి పశువులు... అన్నీ అనువుగా ఉండటంతో ఇక్కడే మకాం వేసింది. ఉదయం వేళల్లో దాని జాడ దొరకదు. తెల్లవారుజామున పశువులపాకల వద్దకు వచ్చి మూగ జీవాలను వేటాడుతోంది. పులి మనుషులపై పడితే పరిస్థితి ఏమిటి? అంటూ ప్రత్తిపాడు మండలంలోని ఒమ్మంగి, శరభవరం, పొదురుపాక తదితర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.