చిరుతతో రైతుల ఢీ..!
ABN , First Publish Date - 2022-01-25T16:31:30+05:30 IST
ఈరోడ్ జిల్లా నంబియూరు వద్ద సజ్జ చేలో చొరబడిన చిరుతపులి రైతులపై దాడి చేసింది. దానిని తరిమేందుకు ముగ్గురు రైతులు తలపడ్డారు. అయితే ఆ రైతులపై దాడి చేసిన చిరుత స్థానికులు రావటంతో పారిపోయింది.
- తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలు
చెన్నై: ఈరోడ్ జిల్లా నంబియూరు వద్ద సజ్జ చేలో చొరబడిన చిరుతపులి రైతులపై దాడి చేసింది. దానిని తరిమేందుకు ముగ్గురు రైతులు తలపడ్డారు. అయితే ఆ రైతులపై దాడి చేసిన చిరుత స్థానికులు రావటంతో పారిపోయింది. సోమవారం ఉదయం జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. నంబియూరు సమీపం పాప్పాం కుళంలో మారన్ (62), వరదరాజ్ (61), వెంకటాచలం (48) అనే రైతులు నివశిస్తున్నారు. సోమవారం ఉదయం మారన్ తన సజ్జ చేను పరిశీలించేం దుకు వెళ్ళాడు. ఆ చేలో దాగి ఉన్న చిరుతపులి హఠాత్తుగా మారన్పై దాడికి దిగింది. ఆ చిరుతను పట్టుకుని మారన్ తరిమికొట్టేందుకు ప్రయత్నించాడు. అతడి కేకలు విని వరదరాజ్, వెంకటాచలం కూడా పరుగెత్తు కెళ్ళారు. ముగ్గురు కలిసి ఆ చిరుతతో పోరుకు దిగారు. కాని చిరుతపులి ముగ్గురిపై పంజా విసిరింది. కాగా చిరుత దాడి విషయం తెలుసుకుని స్థానికులంతా అక్కడికి కేకలు వేసుకుంటూ రావడంతో చిరుతపులి పారి పోయింది. ఈ విషయం తెలిసిన అటవీ శాఖాధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.. ముగ్గురిపై చిరుత దాడి చేసినట్టు నిర్ధారించి తీవ్రంగా గాయపడిన వారిని అవినాశి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అటవీ శాఖ అధికారులు ఆ సజ్జ చేనులో ఉన్న చిరుతపులి కాలి అడుగు జాడలను బట్టి అది ఏ దిశగా వెళ్ళిందో చూస్తూవెళ్లినా కానీ దానిజాడ కనుగొనలేకపోయారు. చివరకు చిరుతపులిని పట్టుకునేందుకు సజ్జ చేలలో బోన్లు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు.