అక్రమంగా స్థలాన్ని కట్టబెట్టేస్తారా?
ABN , First Publish Date - 2021-01-19T05:34:41+05:30 IST
పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధి పదో వార్డు పారసంబ గ్రామంలో ప్రభుత్వ స్థలంపై కొనసాగుతున్న వివాదం తారా స్థాయికి చేరింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం పలాస తహసీల్దార్ మధుసూదనరావు, సీఐ శంకరరావు ఆ స్థలాన్ని పరిశీలించి, ఆ గ్రామానికి చెందిన సబ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ కుటుంబానికి చెందుతుందని చెప్పడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివాదాస్పద స్థలంపై పారసంబ గ్రామస్థులు ఆందోళన..
సబ్ కలెక్టర్ ఒత్తిడికి తలొగ్గుతున్నారంటూ అధికారుల నిలదీత
కాశీబుగ్గ, జనవరి 18 : పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధి పదో వార్డు పారసంబ గ్రామంలో ప్రభుత్వ స్థలంపై కొనసాగుతున్న వివాదం తారా స్థాయికి చేరింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం పలాస తహసీల్దార్ మధుసూదనరావు, సీఐ శంకరరావు ఆ స్థలాన్ని పరిశీలించి, ఆ గ్రామానికి చెందిన సబ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ కుటుంబానికి చెందుతుందని చెప్పడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ కలెక్టర్ కుటుంబ సభ్యులకు అధికారులు వత్తాసు పలుకుతూ... గ్రామకంఠంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా కట్టబెట్టేందుకు చూస్తున్నారని వారు మండిపడ్డారు. గ్రామస్థులంతా అక్కడే బై ఠాయించి నిరసన తెలిపారు. గ్రామకంఠంగా ఉన్న ఈ స్థలాన్ని ఏ విధంగా ఆ కుటుంబానికి చెందుతుందని అధికారులను నిలదీశారు. సబ్ కలెక్టర్గా ఉన్న రోణంకి గోపాల్కృష్ణ ఒత్తిడితోనే అధికారులు తప్పుడు మార్గంలో పట్టాలు ఇచ్చేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న కాళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ ఘటన స్థలానికి చేరుకొని రోణంకి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సమస్యను సామసరస్యంగా పరిష్కరించుకోవాలని గ్రామస్థులకు సూచించారు. ఏళ్ల తరబడి ఈ స్థలంపై పోరాటం చేస్తున్నామని, తక్షణమే పరిష్కార మార్గం చూపించాలని వారు పట్టుబట్టారు. దీంతో మంత్రి అప్పలరాజు సమక్షంలో చర్చిద్దామని తిలక్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అనంతరం తహసీల్దార్ మధుసూదన్ మాట్లాడుతూ... ఆర్మీ కోటాలో 2012లో రోణంకి అప్పారావు కుమారుడు కోదండరావుకు, కుమార్తె ఊర్వశికి మూడేసి సెంట్లు చొప్పున స్థలం కేటాయించినట్టు రికార్డుల్లో ఉందని చెప్పారు.