వెలిగొండ పురోగతిపై ‘మాటల్లేవ్‌’ అంటూ విసుర్లు

ABN , First Publish Date - 2021-12-08T04:24:16+05:30 IST

వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై మీడియా అడిగిన ప్రశ్నలకు ‘మాటల్లేవ్‌’ అంటూ స్పెషల్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి విసురుగా సమాధానం చెప్పకుండా వెళ్లడం విమర్శలకు తావిచ్చింది.

వెలిగొండ పురోగతిపై ‘మాటల్లేవ్‌’ అంటూ విసుర్లు
ప్రిన్సిపల్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డికి సొరంగం పనుల పురోగతిని వివరిస్తున్న అధికారులు

ప్రాజెక్టు సొరంగం పనులను పరిశీలించిన ప్రిన్సిపల్‌ సెక్రటరీ

మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పని ఉన్నతాధికారులు


పెద్దదోర్నాల, డిసెంబరు 7 : వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై మీడియా అడిగిన ప్రశ్నలకు ‘మాటల్లేవ్‌’ అంటూ స్పెషల్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి విసురుగా సమాధానం చెప్పకుండా వెళ్లడం విమర్శలకు తావిచ్చింది.  ఎంతో బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్న ఆయన ప్రాజెక్ట్‌ పనుల స్థితిగతులను ప్రజలకు పారదర్శకంగా వివరించాల్సి ఉన్నా అలా కసురుగా వెళ్లడంలో ఆంతర్యమేమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు. 

మండలంలోని కొత్తూరు వద్ద నిర్మిస్తున్న పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలోని సొరంగం పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. సోమవారం ప్రాజెక్టులోని ప్రధాన హెడ్‌ రెగ్యులేటర్‌ పనుల(శ్రీశైలం డ్యాంలో) వద్ద జరుగుతున్న సొరంగం రెండో వైపు తవ్వకం పనులను పరిశీలించిన ఆయన రెండో రోజు టీబీఎం ద్వారా నిర్వహించే తవ్వకం పనులను పనులు చేశారు. స్థానిక అధికారులు ఏర్పాటు చేసిన లోకో ట్రాలీ ద్వారా సొరంగం అంతర్భాగం పనులను పరిశీలించారు. పనుల పురోగతిని ఇంజనీరింగ్‌ అధికారులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఆయనను కలిసిన విలేకరులు ప్రాజెక్టుపై వివరాలను కోరినా చెప్పలేదు. ఈ కార్యక్రమంలో సీఈ నారాయణరెడ్డి, ఎస్‌ఈ వరలక్ష్మి, ఈఈ అబూతాలిమ్‌, డీఈలు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T04:24:16+05:30 IST