16 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఆపై గొంతు కోసి చంపేసిన మృగాళ్లు!

ABN , First Publish Date - 2021-01-18T22:22:21+05:30 IST

రాజస్థాన్‌లోని బార్మెర్ జిల్లాలో మరో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలికను దుండగులు గొంతు కోసి చంపేశారు.

16 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఆపై గొంతు కోసి చంపేసిన మృగాళ్లు!

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లోని బార్మెర్ జిల్లాలో మరో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలికను దుండగులు గొంతు కోసి చంపేశారు. అంతకుముందు ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. బాధిత బాలిక పొరుగింట్లో ఉంటున్న ఇద్దరు యువకులను అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. సువాలా గ్రామంలోని బాధిత బాలిక ఇంటి వెనక ఉన్న పొలాల్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. 


బాలికను గొంతు కోసి చంపేశారని, అంతకుముందు ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందని భావిస్తున్నట్టు బర్మార్ సూపరింటెండెంట్ ఆనంద్ శర్మ తెలిపారు. అత్యాచారం జరిగిందా? లేదా? అన్నది పోస్టుమార్టం అనంతరం తెలుస్తుందన్నారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు శర్మ పేర్కొన్నారు. విషయం తెలిసిన గ్రామస్థులు ఆందోళనకు దిగారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 


బాధిత బాలిక కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. శనివారం రాత్రి బాలిక ఇంట్లో నిద్రపోయింది. ఉదయం లేచి చూస్తే కనిపించలేదు. దీంతో ఆమె కోసం గాలించగా ఈ ఉదయం ఇంటి వెనక ఉన్న పొలాల్లో మృతదేహం లభ్యమైంది.  

Updated Date - 2021-01-18T22:22:21+05:30 IST