అద్దె కోసం వచ్చిన యజమాని.. తలుపు తీయకపోవడంతో కిటికీలోంచి చూస్తే..

ABN , First Publish Date - 2020-07-11T15:59:34+05:30 IST

వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా, కొందురుగు మండలం, రావిర్యాల గ్రామానికి చెందిన మల్లేపల్లి వినోద్‌(40), లక్ష్మి భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు.

అద్దె కోసం వచ్చిన యజమాని.. తలుపు తీయకపోవడంతో కిటికీలోంచి చూస్తే..

వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి బలవన్మరణం


మన్సూరాబాద్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు  ఆత్మహత్య చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా, కొందురుగు మండలం, రావిర్యాల గ్రామానికి చెందిన మల్లేపల్లి వినోద్‌(40), లక్ష్మి భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. నగరానికి వలస వచ్చి నాగోల్‌లో ఉంటున్నారు. వినోద్‌ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చాలా కాలం నుంచి అతడు మద్యానికి బానిసయ్యాడు. లాక్‌డౌన్‌ వల్ల ఆటో సరిగా నడవక ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. మద్యానికి డబ్బులు ఇవ్వాలంటూ భార్యతో తరచూ గొడవపడుతున్నాడు. డబ్బులు తీసుకురావాలని గొడవపడి నాలుగు రోజుల క్రితం భార్యను కొట్టాడు. దీంతో ఆమె పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. శుక్రవారం ఉదయం ఆటో యజమాని శ్రీను అద్దె అడిగేందుకు వినోద్‌ ఇంటికి వచ్చాడు. తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా వినోద్‌ గదిలో రాడ్డుకు చీరతో ఉరేసుకొని వేలాడుతూ కనిపించడంతో ఎల్‌బీనగర్‌ పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. భార్య పుట్టింటికి వెళ్లిందన్న మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.


కవాడిగూడలో..

ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. కవాడిగూడ ఉన్నికోటలో తల్లీకుమారులు ఎ. వెంకటమ్మ, నరేష్‌(28) నివసిస్తున్నారు. నరేష్‌ ఆటో డ్రైవర్‌. వెంకటమ్మ ఇళ్లలో పనిచేస్తోంది. ఆమె శుక్రవారం ఉదయం 10 గంటలకు పనికి వెళ్లింది. మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి తిరిగి రాగా కుమారుడు నరేష్‌ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని కనిపించాడు. ఆమె వెంటనే గాంధీనగర్‌ పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించి వెంకటమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నరేష్‌ ఆత్మహత్యకుగల కారణాలు తెలియరాలేదు. 


మద్యానికి బానిసై..

మద్యానికి బానిసైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. యాదవ్‌నగర్‌లో నివసిస్తున్న సతీ్‌షకుమార్‌(33)కు కనక దుర్గతో కొన్నేళ్ల క్రితం వివాహం అయింది. సతీ్‌షకుమార్‌ కొద్దిరోజుల క్రితం ఉద్యోగం మానేసి మద్యానికి బానిసయ్యాడు. రోజూ భార్యతో గొడవపడేవాడు. గురువారం ఇంట్లో ఉరేసుకున్నాడు. భార్య కనకదుర్గ ఫిర్యాదు మేరకు మల్కాజిగిరి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-07-11T15:59:34+05:30 IST