గోదావరిలో ముగ్గురి గల్లంతు
ABN , First Publish Date - 2022-05-21T06:07:16+05:30 IST
గోదావరిలో ముగ్గురి గల్లంతు
తల్లి, కుమారుడితో పాటు మరొక వ్యక్తి మునక
మరో చిన్నారి క్షేమంగా బయటకు
చీకటి పడటంతో గాలింపునకు ఆటంకం
బూర్గంపాడు/ చండ్రుగొండ/ జూలురుపాడు, మే 20: స్నానానికి వెళ్లి గోదావరిలో ముగ్గురు వ్యక్తులు గల్లంతయిన సంఘటన శుక్రవారం సాయంత్రం బూర్గంపాడు మండలం మోతెపట్టీనగర్ పుష్కర్ఘాట్ వద్ద జరిగింది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. చండ్రుగొండకు చెందిన సయ్యద్ రిహనాకు ఏన్కూరుకు చెందిన సమ్మద్తో విహహం జరిగింది. గత కొంతకాలం క్రితం సమ్మద్ మృతిచెందడంతో రిహనా తన ఇద్దరు కుమారులతో కలిసి చండ్రుగొండలో నివాసం ఉంటోంది. మూడు రోజుల క్రితం కుమారులను తీసుకుని ఖమ్మంలోని సమీప బంధువుల ఇంటికి వెళ్లిన ఆమె మళ్లీ గురువారం ఏన్కూరులోని అత్తగారింటికి వచ్చింది. శుక్రవారం జూలురుపాడు మండలం కాకర్లకు చెందిన రాయపూడి నరసింహారావు అనే వ్యక్తి ఆటోలో మోతె పుష్కరఘాట్ వద్దకు వచ్చి ఆ నలుగురూ స్నానానికని గోదావరిలోకి దిగారు. రిహనాతో పాటు పదేళ్ల వయసున్న ఆమె చిన్న కుమారుడు ఇర్ఫాన్, ఆటో డ్రైవర్ నర్సింహారావు గల్లంతవగా పెద్ద కుమారుడు ఇమ్రాన్ క్షేమంగా బయటపడ్డాడు. స్థానికులకు సమాచారం అందించడంతో పోలీసులు, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని గజఈతగాళ్లతో గోదావరిలో గాలింపు చేపట్టారు. కొట్టుకుపోయిన రిహానాకు 30ఏళ్లు కాగా గల్లంతైన ఇర్ఫానకు పదేళ్లు, ఆటోడ్రైవర్కు 29ఏళ్ల వయసుంటుంది. అయితే సాయంత్రం వెలుతురు తగ్గిపోవడంతో గాలింపు చర్యలను నిలిపివేసిన అధికారులు, తిరిగి శనివారం ఉదయం చేపట్టనున్నట్లు తెలిపారు.
తల్లి, తమ్ముడి కోసం..
కాగా తల్లి, తమ్ముడు ఇర్ఫాన్ కళ్ల ఎదుట గోదావరిలో గల్లంతు కావడంతో ఇమ్రాన్ గుండెలవిసేలా రోదించాడు. బోరున విలపిస్తూ గోదావరి ఒడ్డున ఇసుక తిన్నెలో దిక్కుతోచని స్థితిలో కూర్చుని.. తల్లి, తమ్ముడు ఆచూకీ కోసం అతడు ఎదురుచూసిన తీరు స్థానికుల కంటతడి పెట్టించింది.
గతంలోనూ ఇద్దరు యువకులు
గతేడాది ఏప్రిల్లో ఈ ప్రదేశంలో ఈత సరదా ఇద్దరు యువకుల ప్రాణాలమీదకు తెచ్చింది. సారపాకకు చెందిన షణ్ముఖరావు, హరిచందు, చక్రి అనే ముగ్గురు యువకులు పెంపుడు కుక్కను తీసుకుని ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో వెంట తీసుకువెళ్లిన పెంపుడు కుక్క గోదావరిలో లోతులోకి వెళ్లడం గమనించి షణ్ముఖరావు, చందు అనే ఇద్దరు యువకులు రక్షించే క్రమంలో నదిలో గల్లంతై మృతి చెందారు.