మూడంచెల వ్యూహం..మూడు డివిజన్లలోనూ విజయం

ABN , First Publish Date - 2020-12-05T09:07:10+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో బాధ్యతలు అప్పగించిన మూడు డివిజన్లలోనూ మంత్రి హరీశ్‌రావు పార్టీ అభ్యర్థులను గెలిపించారు. గతం కంటే ఒక సీటు అధికంగా సాధించి ప్రత్యేకత నిలుపుకొన్నారు.

మూడంచెల వ్యూహం..మూడు డివిజన్లలోనూ విజయం

 ఫలించిన మంత్రి హరీశ్‌రావు మంత్రాంగం

 పటాన్‌చెరు నియోజకవర్గంలో బాధ్యతలు

 దుబ్బాక ఓటమికి జీహెచ్‌ఎంసీలో చెల్లు..

 2016 కంటే ఒక డివిజన్‌ అధికంగా గెలుపు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో బాధ్యతలు అప్పగించిన మూడు డివిజన్లలోనూ మంత్రి హరీశ్‌రావు పార్టీ అభ్యర్థులను గెలిపించారు. గతం కంటే ఒక సీటు అధికంగా సాధించి ప్రత్యేకత నిలుపుకొన్నారు. జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్‌ చాలా సిట్టింగ్‌ డివిజన్లను కోల్పోగా.. హరీశ్‌ పర్యవేక్షించిన పటాన్‌చెరు నియోజకవర్గంలో మాత్రం అన్నిట్లోనూ విజయం సాధించడం విశేషం. తద్వారా, దుబ్బాక ఉప ఎన్నిక చేదు అనుభవాన్ని హరీశ్‌ అధిగమించగలిగారు. దీనివెనుక ఆయన అమలు చేసిన మూడంచెల వ్యూహం కీలక పాత్ర పోషించింది. 


నాడు రెండే.. నేడు మూడూ

2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం, భారతీనగర్‌ డివిజన్లను టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. పటాన్‌చెరు డివిజన్‌ కాంగ్రెస్‌ ఖాతాలోకి వెళ్లింది. ఈసారి మాత్రం మూడింటినీ చేజిక్కించుకోవాలని హరీశ్‌ పకడ్బందీ వ్యూహం రచించారు. ప్రతి పోలింగ్‌ బూత్‌కు పార్టీ తరఫున ఒకరిని బాధ్యుడిగా నియమించారు. ఎంపీ, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులకు డివిజన్‌ బాధ్యతలు అప్పగించారు. పటాన్‌చెరును మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రామచంద్రాపురం, భారతీనగర్‌లను అందోలు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ పర్యవేక్షించారు.  కాంత్రికిరణ్‌కు రామచంద్రాపురం ప్రాంతంతో అనుబంధం ఉండటం గమనార్హం.


ఇక క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని పరిశీలించేందుకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను వినియోగించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు  పటాన్‌చెరు, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణకు రామచంద్రాపురం, ఎమ్మెల్సీ పి.భూపాల్‌రెడ్డికి భారతీనగర్‌లను కేటాయించారు. ప్రచారం, ఇతరత్రా వ్యవహారాలు చూసే బాధ్యతను ఎమ్మెల్యే జి.మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్‌ హుస్సేన్‌కు అప్పగించారు. నాయకులు క్షేత్రస్థాయిలో ప్రచారం పకడ్బందీగా నిర్వహించేలా మంత్రి పర్యవేక్షించారు.


నామినేషన్ల ప్రక్రియ ముగిసి, ప్రచారం మొదలైనప్పటి నుంచి ఇంటింటికి తిరిగి ఓటర్లను అభ్యర్థించడమే కాకుండా వివిధ సంఘాల ప్రతినిధులు, ముఖ్య సభ్యులను పిలిచి మాట్లాడారు. కార్మిక సంఘాల ప్రతినిధులతోనూ హరీశ్‌ సమావేశమై తమ వైపు తిప్పుకొనేలా చేశారు. ప్రచారం చివరి రోజున మంత్రి నిర్వహించిన బహిరంగ సభలు కూడా వియవంతమయ్యాయి. మూడు డివిజన్ల యంత్రాంగం అంతటినీ ఒక్కతాటిపై నడిపించి తన బాధ్యతలకు పూర్తి న్యాయం చేకూర్చారు.


Updated Date - 2020-12-05T09:07:10+05:30 IST