ఘోర తప్పిదం.. మహిళలకు కొవిడ్ వ్యాక్సిన్‌కు బదులు రేబిస్ వ్యాక్సిన్

ABN , First Publish Date - 2021-04-09T21:30:52+05:30 IST

కొవిడ్ టీకా వేయించుకునేందుకు వెళ్లిన ముగ్గురు మహిళలకు అక్కడి సిబ్బంది రేబిస్ వ్యాక్సిన్

ఘోర తప్పిదం.. మహిళలకు కొవిడ్ వ్యాక్సిన్‌కు బదులు రేబిస్ వ్యాక్సిన్

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. కొవిడ్ టీకా వేయించుకునేందుకు వెళ్లిన ముగ్గురు మహిళలకు అక్కడి సిబ్బంది రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వడం కలకలం రేపింది. టీకా తీసుకున్న ముగ్గురిలో ఒకరు అనారోగ్యం పాలవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. షామ్లీ జిల్లాలోని కంధాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో గురువారం జరిగిందీ ఘటన.  


సరోజ్ (70), అనార్కలి (72), సత్యవతి (60) కలిసి వ్యాక్సిన్ తొలి డోసు తీసుకునేందుకు ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. వెంటనే అక్కడి అధికారులు ఒక్కొక్కరితో రూ. 10 సిరంజిలు కొనిపించారు. అనంతరం వారికి కరోనా వ్యాక్సిన్ బదులు రేబిస్ టీకాలు వేసి పంపించారు. టీకా వేయించుకుని ఇంటికి వెళ్లిన సరోజ్‌కు మత్తుగా, అసౌకర్యంగా ఉన్నట్టు అనిపించింది. ఆమె అదో రకంగా ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్ క్లినిక్‌కు తీసుకెళ్లారు. 


అక్కడామెను పరీక్షించిన వైద్యుడు ఆమెకు రేబిస్ టీకా వేసినట్టు గుర్తించాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాధిత కుటుంబ సభ్యులు వ్యాక్సిన్ వేసిన సిబ్బందిపై మండిపడ్డారు. మరీ ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం ఏంటని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి నిలదీశారు. షామ్లీ సీఎంవో సంజయ్ అగర్వాల్‌కు ఫిర్యాదు చేశారు. నిర్లక్ష్యంగా వ్యహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 


విషయం ఉన్నతాధికారులకు చేరడంతో ఘటనపై విచారణకు అసిస్టెంట్ సీఎంవో, సీఎంవోలను నియమించారు. బాధితులు, వారి కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని వారు నమోదు చేస్తారని డీఎం జస్జీత్ సింగ్ తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.  

Updated Date - 2021-04-09T21:30:52+05:30 IST