చేపల కూర తిన్న కుటుంబంలో తీరని విషాదం
ABN , First Publish Date - 2021-07-27T16:27:44+05:30 IST
బీహార్లోని ఛప్రాలో విషాదం చోటుచేసుకుంది.
పట్నా: బీహార్లోని ఛప్రాలో విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి దరియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని సాదావారా ప్రాంతంలో రాత్రి చేపలతో చేసిన ఆహారాన్ని తిని, నిద్రపోయిన ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో బాలుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ పీఎంసీహెచ్లో చేరి చికిత్స పొందుతున్నాడు. మృతులలో తండ్రి, కొడుకు, మేనల్లుడు ఉన్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ కుటుంబ సభ్యులు డిన్నర్లో చేపలతో చేసిన ఆహారాన్ని తిన్నారు. కొద్దిసేపటి తరువాత వారంతా నిద్రపోయారు.
అయితే ఇంతలోనే వారికి ఆనారోగ్యం వాటిల్లింది. దీనిని కుటుంబంలోని ఇతర సభ్యులు గ్రహించేలోగానే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వెంటనే ఇంటి పెద్దను ఆసుపత్రికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఈరోజు ఉదయం అతను మృతి చెందాడు. కుటుంబంలోని ఇంకో చిన్నారి ఆరోగ్యం విషమించింది. ప్రస్తుతం ఆ చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ కుటుంబ సభ్యులు తిన్న చేపలు విషపూరితం అయివుంటాయని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.