భళా పోలీస్..వారంరోజుల్లోనే మూడు కేసులు ఛేదింపు
ABN , First Publish Date - 2020-10-13T06:23:35+05:30 IST
దొంగతనాల కేసుల చేధనలో పోలీసులు చాకచక్యంగా వ్యవరిస్తూ.. నిందితులను పట్టుకుంటున్నారు
సోమవారం ముగ్గురు నిందితుల అరెస్టు
కేసుల చేధనలో చాలెంజ్గా తీసుకుంటున్న త్రీటౌన్ సీఐ
ఖమ్మంక్రైం, అక్టోబరు12: దొంగతనాల కేసుల చేధనలో పోలీసులు చాకచక్యంగా వ్యవరిస్తూ.. నిందితులను పట్టుకుంటున్నారు. వారంలో మూడు కేసులు చేధించి శభాష్ అనిపించుకుటున్నారు. వీటితోపాటు పలు కేసులలో ఉన్న నిందితులను సైతం వేగవంతంగా విచారణ జరిపి, కేసులను కొలిక్కి తెస్తున్నారు. ఇటీవల నగరంలోని ప్రకాష్నగర్కు చెందిన ఆర్ఎంపీ గొల్లపుడి మహేందర్ ఇంటిలో, మెడికల్ షాపులో రూ.40వేల చోరీ చేసిన ఘటనలో నిందితులను సోమవారం త్రీటౌన్ సీఐ అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని త్రీటౌన్ ప్రాంతంలో అనుమానస్పదంగా తిరుగుతున్న ప్రకాష్నగర్కు చెందిన జింకలసాయి సామ్రాట్, చొప్పరిపవన్, గణపవరపు వెంకటేష్ను అదుపులోకి తీసుకుని విచారించారు.
మెడికల్షాపులో దొంగతనం చేసింది మేమే అని విచారణలో ఒప్పుకోవడంతో వారి దగ్గరనుంచి రూ.36వేలు స్వాధీనం చేసుకున్నారు. కోర్టుకు రిమాండ్చేసి అనంతరం వారిని జైలుకు పంపారు. ఇటీవల ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద శిశువును పారేసిన ఘటన కేసును చేధించారు. డాబాల బజార్లో మెడలో బంగారం గొలుసు చోరీ ఘటనలో నిందితుడిని అరెస్టు చేశారు. వారంరోజుల్లోనే మూడు కేసులలో నిందితులను అదుపులోకి తీసుకోవడంతో సీఐ శ్రీధర్, ఎస్ఐ శ్రావన్కుమార్, సిబ్బందిని సీపీ తఫ్సీర్ ఇక్బాల్ ఏడీసీపీ ఇంజారపు పూజ, ఏసీపీ ఆంజనేయులు అభినందించారు.