‘మూడు రాజధానుల ప్రతిపాదన వెనక్కి తీసుకోండి’
ABN , First Publish Date - 2021-11-12T00:57:05+05:30 IST
అమరావతి రాజధాని కోసం భూములిస్తే మూడు రాజధానులంటూ అన్యాయం చేస్తున్నారని రాజధానికి భూములు త్యాగం చేసిన
తుళ్లూరు: అమరావతి రాజధాని కోసం భూములిస్తే మూడు రాజధానులంటూ అన్యాయం చేస్తున్నారని రాజధానికి భూములు త్యాగం చేసిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని వారు చేస్తున్న ఉద్యమం గురువారంతో 695వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ, సీఎం జగన్రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల ప్రతిపాదన వెంటనే వెనకి ్క తీసుకోవాలన్నారు. మూడు రాజధానులతో ప్రయోజనం లేకపోయినా వ్యక్తిగత, రాజకీయ స్వార్థం కోసం ప్రతిపాదన చేశారన్నారు. ప్రజా రాజధాని అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని మూడు ముక్కల ఆట వద్దు అని పోరాటం చేస్తుంటే ఏదో రకంగా అణచి వేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు.
కోర్టు అనుమతితో పాద యాత్ర చేస్తుంటే దానిని కూడా అడ్డుకోవాలని చూడటం సిగ్గు చేటన్నారు. న్యాయం కోసం పోరాటం చేస్తుంటే అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు ముక్కల ఆట వద్దని ఐదు కోట్ల మంది చెబుతుంటే అమరావతిని నాశనం చేయటం కోసం ఆ ప్రతిపాదన పెట్టారన్నారు. అమరావతిపై కుట్రలు ఆపాలన్నారు. మహా పాద యాత్రను అడ్డుకోవాలని చూస్తే పోరాటం ఉధృతం చేస్తామన్నారు. రాజకీయాలను రైతులకు అంటగట్ట వద్దన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. దీపాలు వెలిగించి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. రాజధాని 29 గ్రామాలలో ఆందోళనలు కొనసాగాయి.