‘చిత్తూరు’ చోరీ కేసులో ముగ్గురి అరెస్టు
ABN , First Publish Date - 2021-05-08T07:01:51+05:30 IST
చిత్తూరు మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు సోదరుడు, పారిశ్రామికవేత్త డీకే బద్రినారాయణ ఇంట్లో భారీ చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
రూ.3.04 కోట్ల సొత్తు స్వాధీనం
వారం రోజుల్లోనే నిందితులను పట్టుకున్న పోలీసులు
చిత్తూరు, మే 7: చిత్తూరు మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు సోదరుడు, పారిశ్రామికవేత్త డీకే బద్రినారాయణ ఇంట్లో భారీ చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ.3.04 కోట్ల విలువైన వజ్రాలు, బంగారం, నగదు స్వాధీనం చేసుకుని ముగ్గురిని రిమాండ్కు తరలించారు. ఆ వివరాలను శుక్రవారం చిత్తూరులో ఎస్పీ సెంథిల్కుమార్ మీడియాకు వివరించారు. ఆయన తెలిపిన ప్రకారం.. చిత్తూరు బీవీరెడ్డి కాలనీలోని పారిశ్రామికవేత్త బద్రినారాయణ ఇంట్లో గతనెల 28వ తేది రాత్రి బంగారు ఆభరణాలు, వజ్రాలు, నగదు చోరీ జరిగింది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నగరంలోని సీసీ పుటేజీలను, టెక్నికల్ అనాలసిస్ ద్వారా నిందితుల సమాచారాన్ని సేకరించారు. ఇలా అందిన సమాచారం మేరకు శుక్రవారం ఉదయం 5 గంటలకు రెడ్డిగుంట సర్కిల్కు పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో బుల్లెట్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు వీరిని చూసి పారిపోవడానికి ప్రయత్నించగా.. అదుపులోకి తీసుకున్నారు. ఇలా పట్టుబడిన విశాఖ జిల్లా కొత్తగాజువాక బీసీరోడ్డుకు చెందిన కర్రి సతీష్రెడ్డి(37), తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా చెన్నేపేట్ మండలం బాపంమోర్ తాండాకు చెందిన ఎన్.నరేంద్ర.. ఈ చోరీకి పాల్పడినట్లు అంగీకరించారు. వీరి నుంచి రూ.3.04 కోట్ల విలువ చేసే బంగారు డైమండ్ పొదిగిన ఆభరణాలు (2.3 కిలోలు), నగదు స్వాఽధీనం చేసుకున్నారు. ఇందులో 50 గ్రాముల బంగారాన్ని కుదువ పెట్టుకున్న కడప జిల్లా రాయచోటికి చెందిన కుమార్ ఆచారితో పాటు వీరిద్దరినీ అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడైన సతీష్రెడ్డిపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లె, కాకినాడ, విజయవాడ, నెల్లూరు తదితర చోట్ల మొత్తం 70 కేసులున్నాయి. రెండో నిందితుడైన నరేంద్రపై హైదరాబాదు నగరంలోని వివిధ పోలీస్స్టేషన్లలో 14, తమిళనాడులో రెండు కేసులు ఉన్నాయి. కాగా, చిత్తూరులో చోరీ కేసును వారం రోజుల్లోనే ఛేదించడంలో ప్రతిభ చూపిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ రమేష్, రెండో పట్టణ సీఐ యుగంధర్, ఎస్ఐలు మల్లికార్జున, మోహన్కుమార్, సిబ్బంది దేవరాజులురెడ్డి, బాబు, జయచంద్ర, సుధీర్, తనికాచలం, గోవిందు, దుర్గయ్యను ఎస్పీ అభినందించారు.