రైతు, వ్యవసాయ సంబంధ బిల్లులకు రాజ్యసభ ఆమోదం

ABN , First Publish Date - 2020-09-20T19:44:12+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు, వ్యవసాయ సంబంధ బిల్లులకు రాజ్యసభ ఆమోదం లభించింది...

రైతు, వ్యవసాయ సంబంధ బిల్లులకు రాజ్యసభ ఆమోదం

న్యూ ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు, వ్యవసాయ సంబంధ బిల్లులకు రాజ్యసభ ఆమోదం లభించింది. విపక్షాల తీవ్ర ఆందోళనల మధ్య బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. అయితే.. విపక్షాలు మాత్రం ఓటింగ్ కోసం పట్టుబట్టాయి. విపక్షాల డిమాండ్‌ను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ తిరస్కరించారు. చివరికి మూజువాణి ఓటుతో బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఆమోదం అనంతరం రాజ్యసభను రేపటికి డిప్యూటీ చైర్మన్  వాయిదా వేశారు. ఈ బిల్లులకు బీజేపీ, బీజేడీ, వైసీపీ, టీడీపీ, అన్నాడీఎంకే మద్దతివ్వగా.. కాంగ్రెస్‌, తృణమూల్‌, టీఆర్‌ఎస్‌, డీఎంకే, శివసేన, ఆర్జేడీ, అకాలీదళ్‌, ఎస్పీ, ఆప్‌, బీఎస్పీలు వ్యతిరేకించాయి.


ఇదివరకే ఈ బిల్లులను లోక్‌సభ ఆమోదించింది. కాగా.. ఆదివారం నాడు రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను కేంద్ర వ్యవసాయం మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లులు ఎంతో చారిత్రాత్మకమైనవని, రైతుల జీవితాల్లో పెను మార్పులు తీసుకొస్తాయని ఆయన ప్రకటించారు. ఇదిలా ఉంటే.. రైతుల గొంతుకోసేలా కేంద్రం వ్యవసాయ బిల్లులు ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు ప్రతిపక్షాల విమర్శలు.. మరోవైపు దేశవ్యాప్తంగా ఆందోళనలు తీవ్ర రూపం దాల్చిన విషయం విదితమే.


వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలు ఇలా..

ఈ బిల్లులను ఏపీలో అధికారంలో ఉండే వైసీపీ ఎంపీలు మద్దతివ్వగా.. టీఆర్ఎస్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించింది. పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు మాట్లాడుతూ ఈ బిల్లులను వ్యతిరేకించి మద్దతివ్వలేదు. పార్లమెంట్ బయట మీడియా మీట్ పెట్టి కేంద్రంపై తీవ్ర విమర్శలు సైతం గులాబీ పార్టీ ఎంపీలు గుప్పించారు. ఇవాళ రాజ్యసభలో వైసీపీ విజయసాయిరెడ్డి రైతుల బిల్లులపై మాట్లాడగా ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. రైతు బిల్లులపై కాంగ్రెస్‌ తీరును ఆయన తప్పుబట్టారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలోని అంశాలనే ఎన్డీయే బిల్లుగా తీసుకొచ్చిందని.. కాంగ్రెస్‌ ఆత్మవంచన మానుకోవాలని విజయసాయి వ్యాఖ్యానించగా.. ఆ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.


గందరగోళం..

దేశంలో 20 శాతం జీడీపీ రైతుల ద్వారా సమకూరుతోందని.. బిల్లుల ద్వారా రైతులను బానిసలుగా మార్చేందుకు కేంద్రం యత్నిస్తోందని డీఎంకే ఎంపీ ఇళంగోవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ.. వ్యవసాయ బిల్లుల ద్వారా రైతుల ఆదాయం రెట్టింపవుతుందని కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తుందా? అని ప్రశ్నించారు.


ఈ క్రమంలో రైతు బిల్లులపై రాజ్యసభలో గందరగోళం నెలకొంది. వ్యవసాయ బిల్లు ప్రతుల్ని విపక్ష సభ్యులు చింపేశారు. ఈ బిల్లుతో రైతులకు తీరని నష్టమంటూ నినాదాలతో హోరెత్తించారు. బిల్లును ఉపసంహరించాలని విపక్షాల డిమాండ్‌ చేయడంతో పాటు.. డిప్యూటీ చైర్మన్‌ మైక్‌ను కూడా లాక్కునేందుకు యత్నించారు. ఈ గందరగోళం మధ్యే బిల్లుకు ఆమోదం లభించింది. అనంతరం రాజ్యసభను రేపటికి వాయిదా వేయడం జరిగింది.

Updated Date - 2020-09-20T19:44:12+05:30 IST