రూ.50 వేలు ఇవ్వాలని కాంట్రాక్టర్కు బెదిరింపులు
ABN , First Publish Date - 2020-07-06T09:53:24+05:30 IST
అక్రమ వసూళ్ల కోసం ఓ సివిల్ కాంట్రాక్టర్ను బెదిరించిన ఇద్దరు విలేకరులు, టీడీపీ నాయకులపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు
ఇద్దరు విలేకరులు, టీడీపీ నాయకులపై కేసు
బోడుప్పల్, జూలై 5 (ఆంధ్రజ్యోతి): అక్రమ వసూళ్ల కోసం ఓ సివిల్ కాంట్రాక్టర్ను బెదిరించిన ఇద్దరు విలేకరులు, టీడీపీ నాయకులపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఉప్పల్ చిలుకానగర్లో నివసిస్తున్న దాసరి కృష్ణ సివిల్ కాంట్రాక్టర్. బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని రెడ్డి కాలనీ సర్వే నం. 6, ప్లాట్ నం. 44, 45, 46లో గల 450 గజాల విస్తీర్ణంలో అన్ని అనుమతులతో మూడు ఇండిపెండెంట్ ఇళ్ల నిర్మాణం చేపట్టాడు. నెల రోజుల నుంచి స్థానిక దినపత్రిక జ్యోతి (ఆంధ్రజ్యోతి కాదు) విలేకరి గుండ్ల కుమారస్వామి, వార్తప్రభ విలేకరి గణేశ్తోపాటు మరికొంత మంది విలేకరులు రూ. 50 వేలు ఇవ్వాలని కాంట్రాక్టర్ను బెదిరించారు. టీడీపీ నాయకులు మహేందర్ యాదవ్, సన్నీ కూడా కృష్ణకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. బెదిరింపులు భరించలేక బాధితుడు దాసరి కృష్ణ ఆడియో, వీడియో రికార్డులతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుండ్ల కుమారస్వామి, గణేశ్, మహేందర్ యాదవ్, సన్నితోపాటు మరికొందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.