చంపేస్తామంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్కు బెదిరింపు కాల్స్
ABN , First Publish Date - 2020-08-07T15:13:33+05:30 IST
చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయని పోలీసులకు ఫిర్యాదు చేసి రెండు వారాలు అవుతున్నా చర్యలు తీసుకోకపోవడంపై ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వచ్చిన కాల్స్పైనే పోలీసుల స్పందన ఇలా ఉంటే.. -
ఫిర్యాదు చేసి రెండు వారాలైనా చర్యలు తీసుకోలేదని ఆవేదన
హైదరాబాద్ సిటీ (ఆంధ్రజ్యోతి): చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయని పోలీసులకు ఫిర్యాదు చేసి రెండు వారాలు అవుతున్నా చర్యలు తీసుకోకపోవడంపై ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వచ్చిన కాల్స్పైనే పోలీసుల స్పందన ఇలా ఉంటే.. సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. గత నెల 25వ తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు 7-8 సార్లు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేశారని, మీడియా, యూట్యూబ్ చానెల్లో తాను మాట్లాడుతున్న అంశాల గురించి ఆగంతుకులు ప్రస్తావిస్తూ బెదిరించారని అన్నారు. ఉదయం 6.49 గంటలకు వచ్చిన మొదటి కాల్కు సమాధానం ఇచ్చిన తనను ఆగంతుకుడు అసభ్య పదజాలంతో దూషిస్తూ చంపేస్తానని బెదిరించాడని అన్నారు.
తర్వాత అదే నంబర్ నుంచి ఉదయం 8.59గంటలకు మరో కాల్, మధ్యాహ్నం 12.03 గంటలకు ఇంకో కాల్ వచ్చినా ఆయన స్పందించలేదు. అదేరోజు ఆగంతుకుడు ఇంటర్నెట్ ద్వారా నాలుగైదు సార్లు ఫోన్ చేసి బెదిరించాడని నాగేశ్వర్ తెలిపారు. అదేరోజు హాక్ ఐ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్కు కేసు బదిలీ చేస్తున్నట్లు నాగేశ్వర్కు సందేశం వచ్చింది. పోలీసుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో డీజీపీ, సీపీతో మాట్లాడే ప్రయత్నం చేసినా ఫలితం లేదని ఆయన చెప్పారు. ఫిర్యాదు చేసి రెండు వారాలు గడుస్తున్నా ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం విచారకరమని నాగేశ్వర్ అన్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడనని.. నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ రాజ్యాంగం కల్పించిన అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించలేరని అన్నారు. తనను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.