పోలీసుస్టేషన్పై వెయ్యి మంది దాడి!
ABN , First Publish Date - 2022-04-18T08:30:04+05:30 IST
సోషల్ మీడియాలో పెట్టిన ఓ వీడియో కర్ణాటకలోని హుబ్బళ్లి నగరంలో హింసకు దారితీసింది.
కర్ణాటకలో చిచ్చు రేపిన వీడియో.. పోలీసులకు గాయాలు
బెంగళూరు, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియాలో పెట్టిన ఓ వీడియో కర్ణాటకలోని హుబ్బళ్లి నగరంలో హింసకు దారితీసింది. నగరానికి చెందిన యువకుడు ఓ ప్రార్థనా మందిరంపై కాషాయ జెండా ఎగురవేస్తున్నట్లు ఎడిట్ చేసిన వీడియోను శనివారం రాత్రి సెల్ ఫోన్లో స్టేట్సగా పెట్టుకున్నాడు. గంటన్నర వ్యవధిలోనే అది వైరల్గా మారింది. అతణ్ని అరెస్టు చేయాలంటూ కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు న మోదు చేశారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఓ వర్గానికి చెందినవారు అర్ధరాత్రి పెద్దఎత్తున పాత హుబ్బళ్లి పోలీసుస్టేషన్ వద్ద పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. దాడిలో ఓ ఆలయం అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. ఇన్స్పెక్టర్ సహా 12 మంది పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో భద్రావతి నుంచి సాయుధ బలగాలను రప్పించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నగరమంతా 144 సెక్షన్ విధించారు. వివాదాస్పద వీడియో పెట్టిన యువకుడిని అరెస్టు చేసినట్టు నగర పోలీసు కమిషనర్ లాభురామ్ ప్రకటించారు. సమగ్రంగా విచారణ చేస్తున్నామని చెప్పారు. ఇన్స్పెక్టర్ కాడదేవరమఠ సహా నలుగురు పోలీసులను ఆస్పత్రిలో చేర్చామన్నారు. మతపెద్దలతో చర్చించి సమస్యను అదుపులోకి తెచ్చినట్లు తెలిపారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా దాడికి పాల్పడిన 45 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు.