గాంధీని చంపిన వారే నాపైనా దాడి చేశారు: ఒవైసీ
ABN , First Publish Date - 2022-02-05T23:21:06+05:30 IST
మహాత్మాగాంధీపై దాడిచేసి హత్య చేసిన వారే మీరట్లోతనపైనా దాడి చేశారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ..
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీని హత్య చేసిన వారే మీరట్లో తనపైనా దాడి చేశారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఉత్తరప్రదేశ్ భాగ్పట్ జిల్లాలోని చాప్రౌలి పట్టణంలో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 3న ఒవైసీపై దాడి జరిగిన తర్వాత ఆయన పాల్గొన్న తొలి ర్యాలీ ఇదే. ఒవైసీపై దాడి ఘటనకు సంబంధించి అరెస్ట్ అయిన ఇద్దరికీ బీజేపీతో సంబంధాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
వారు తనపై నాలుగు బుల్లెట్లు కాల్చారని, కానీ అల్లా మాత్రం తనను రక్షించాలని నిర్ణయించుకున్నాడని అన్నారు. మీరెవరూ చంపలేరని, ఎవరినీ అవమానించలేరని, ఎందుకంటే తాను అల్లా వల్లే బతికి ఉన్నానని చెప్పారు. పనిలో పనిగా సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్పైనా మండిపడ్డారు. ఇమ్రాన్ మసూద్కు సమాజ్వాదీ పార్టీ టికెట్ నిరాకరించడంపై మాట్లాడుతూ.. అఖిలేశ్ ఆయనను మోసం చేశారని అన్నారు.
అసద్ నేడు లోని, చప్రౌలీ, గర్ముక్తేశ్వర్లలో ర్యాలీలు నిర్వహించారు. అయితే, ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్కు స్థానిక అధికారులు అనుమతించకపోవడంతో చప్రౌలీలో మాత్రమే మాట్లాడారు. మీరట్ ఘటన తర్వాత యూపీ పోలీసులు ఒవైసీకి భద్రత పెంచారు.