ఆ ఎమ్మెల్యేలు అవినీతిపరులు!
ABN , First Publish Date - 2022-01-13T07:56:54+05:30 IST
ఉమ్మడి కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల అవినీతి, అరాచకాలు పెరిగిపోతున్నాయని, తీరు మార్చుకోకుంటే..
- తీరు మార్చుకోకుంటే.. ఆధారాలతో బయటపెడతా
- మూడు జిల్లాల ఎమ్మెల్యేలకు గోనె ప్రకాశరావు హెచ్చరిక
కరీంనగర్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల అవినీతి, అరాచకాలు పెరిగిపోతున్నాయని, తీరు మార్చుకోకుంటే.. ఆధారాలతో వారి బండారం బయటపెడతానని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు హెచ్చరించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి భూకబ్జాలు, ఇసుక అక్రమ రవాణా తదితర అక్రమాలకు యథేచ్ఛగా తెగబడుతున్నారని ఆరోపించారు. బుధవారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతి నేతలు ఇప్పటికైనా తమ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, బదిలీల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 317 లోపభూయిష్టంగా ఉందని, దీని వల్ల ఇప్పటికే తొమ్మిది మంది ఉపాధ్యాయులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.