ఆ పిల్లలు ప్రత్యేకం

ABN , First Publish Date - 2022-08-02T10:47:52+05:30 IST

ప్రి మెచ్యూర్‌ పిల్లలు ఆస్పత్రి నుంచి ఆరోగ్యంగా డిశ్చార్జ్‌ అయిన తర్వాత క్రమం తప్పకుండా వైద్య పరీక్షల కోసం

ఆ పిల్లలు ప్రత్యేకం

ప్రి మెచ్యూర్‌ పిల్లలు ఆస్పత్రి నుంచి ఆరోగ్యంగా డిశ్చార్జ్‌ అయిన తర్వాత క్రమం తప్పకుండా వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వస్తూ ఉండాలి. పిల్లల ఎదుగుదల, ఇంద్రియాల సామర్ధ్యం, నాడీ మండల పనితీరు, స్పందించే గుణం... ఇలా ఎన్నో అంశాల మీద వైద్యుల పర్యవేక్షణ అవసరం. కాబట్టి క్రమం తప్పక కొన్ని పరీక్షలు అవసరమవుతాయి.


వినికిడి సమస్యలు: పుట్టిన వెంటనే పరీక్ష చేసినా, ప్రతి మూడు నెలలకు వినికిడి పరీక్షలు అవసరమవుతాయి. అంతా మామూలుగా ఉంటే ఏడాది వయసుకు వచ్చిన తర్వాత పరీక్ష చేయించాలి. 


రెటినోపతీ: ప్రీ మెచ్యూర్‌ పిల్లలు పుట్టిన వెంటనే అందించే ఆక్సిజన్‌ పరిమాణం తక్కువైనా, ఎక్కువైనా, లోపించినా కళ్లు దెబ్బతింటాయి. దానివల్ల పెరిగే క్రమంలో రెటినోపతీ తలెత్తవచ్చు. కాబట్టి బిడ్డ పుట్టిన 21 రోజులకే కళ్లు పరీక్ష చేసినా, అప్పటి నుంచి ప్రతి రెండు వారాలకు ఓసారి పరీక్ష చేయిస్తూ ఉండాలి. అలా పూర్తిగా కన్ను ఎదిగేవరకూ నాలుగు నెలలకోసారి, ఏడాదికోసారి, రెండేళ్లకు, ఐదేళ్లకు, ఆరేళ్లకు... ఇలా క్రమం తప్పక ఫాలో అప్‌ చేయిస్తూ ఉండాలి. ఈ సమస్యను నిర్లక్ష్యం  చేస్తే కన్ను దెబ్బతిని లేజర్‌ సర్జరీ, అరుదుగా సర్జరీ కూడా చేయవలసి రావొచ్చు. 


నాడీ సంబంధ ఎదుగుదల: మోటార్‌ (నడక, అవయవాల కదలికలు, సెన్సరీ (స్పర్శ, స్పందించే గుణం) కాగ్నిటివ్‌ (తెలివితేటలు)... ఈ అంశాల్లో సమస్యలు తలెత్తవచ్చు. మెదడులో ఇన్‌ఫెక్షన్‌ లేదా రక్తస్రావం అయితే మోటార్‌ డెవలప్‌మెంట్‌ సమస్యలు తలెత్తుతాయి. రక్త పరీక్ష కోసం పసికందులకు పదే పదే సూది గుచ్చడం వల్ల కూడా మెదడు మీద ప్రభావం పడి రక్తస్రావం జరగవచ్చు. గర్భిణికి మధుమేహం అదుపు తప్పినా, పోషకాలు తగ్గినా, ఇన్‌ఫెక్షన్లు ఉన్నా నెలలు నిండకుండా పుట్టిన బిడ్డలో మెదడు ఎదుగుదల తగుమాత్రంగా ఉండకపోవచ్చు. ఈ కారణాల వల్ల మెదడు ఎదుగుదల కుంటుపడి, తెలివితేటల మీద ప్రభావం పడవచ్చు. ఈ నష్టం జరిగిపోయిన తర్వాత సరిదిద్దే చికిత్సలు లేవు, కాబట్టి ఇలా జరగకుండా నియంత్రించుకోవడం ఒక్కటే మార్గం! 

Updated Date - 2022-08-02T10:47:52+05:30 IST