ఈ ఏడాది అమెరికాలో 25 కొత్త ఔషధాల విడుదల

ABN , First Publish Date - 2022-05-25T07:52:05+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికా మార్కెట్లోకి 20-25 కొత్త జెనరిక్‌ ఔషదాలను ప్రవేశపెట్టాలని డాక్టర్‌ రెడ్డీస్‌ భావిస్తోంది.

ఈ ఏడాది అమెరికాలో 25 కొత్త ఔషధాల విడుదల

రూ.1,700 కోట్ల పెట్టుబడులు: డాక్టర్‌ రెడ్డీస్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికా మార్కెట్లోకి 20-25 కొత్త జెనరిక్‌ ఔషదాలను ప్రవేశపెట్టాలని డాక్టర్‌ రెడ్డీస్‌ భావిస్తోంది. కంపెనీకి అమెరికా మార్కెట్‌ కీలకం. గత ఆర్థిక సంవత్సరంలో 17 ఔషధాలను విడుదల చేశాం. 2022-23లో అంతకంటే ఎక్కవ స్థాయిలో జెనరిక్‌ ఔషధాలను విడుదల చేయనున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ సీఎ్‌ఫఓ పరాగ్‌ అగర్వాల్‌ తెలిపారు. యూరప్‌ మార్కెట్లోకి కంపెనీ గత ఏడాదిలో 34 కొత్త ఔషధాలను విడుదల చేసింది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో ఔషధాలను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. 2022-23లో చైనా మార్కెట్లోకి 7 ఔషధాలను విడుదల చేయాలని యోచిస్తోంది. మరోవైపు గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో 20 ఔషధాలను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది కూడా ఇదే స్థాయిలో ఔషధాలను విడుదల చేయనుంది. అన్ని మార్కెట్ల విడుదల చేసిన ఔషఽధాలను కలిపి 2021-22లో 86 జెనరిక్‌ ఔషధాలను విడుదల చేసింది. 


రూ.1,540 కోట్ల మిగులు నిధులు 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా డాక్టర్‌ రెడ్డీస్‌ రూ.1,500- 1,700 కోట్ల పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది. ఇప్పటికే ఉన్న సదుపాయాల్లో ఈ పెట్టుబడులు పెట్టనుంది. అందుబాటులోకి రానున్న ఇంజెక్టబుల్స్‌ సదుపాయం, బయోలాజిక్స్‌లో పెట్టుబడులు పెట్టనున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ సీఈఓ ఎరేజ్‌ ఇజ్రాయెలీ అన్నారు. 2021-22 చివరి నాటికి కంపెనీ వద్ద రూ.1,540 కోట్ల నికర మిగులు నిధులు ఉన్నాయి. 


కొనుగోళ్లపై ఆసక్తి..

ఔషధ బ్రాండ్స్‌ కొనుగోలుపై డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఆసక్తి చూపుతోంది. కంపెనీ వృద్ధికి తోడ్పడే బ్రాండ్స్‌ కోసం భారత్‌తో పాటు ఏ మార్కెట్లోనైనా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. భారత్‌ మార్కెట్‌ కోసం ఈ మధ్యనే నొవార్టిస్‌ నుంచి వొవెరాన్‌ ఔషధాన్ని డాక్టర్‌ రెడ్డీస్‌ తీసుకుంది. 

Updated Date - 2022-05-25T07:52:05+05:30 IST