ఈసారీ వడ్డీ రేట్లు యథాతథం

ABN , First Publish Date - 2022-04-04T07:59:40+05:30 IST

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఇప్పట్లో కీలక వడ్డీ రేట్లు పెంచే సూచనలు కనిపించడం లేదు.

ఈసారీ వడ్డీ రేట్లు యథాతథం

జూ వృద్ధికి చేయూతకే ఆర్‌బీఐ మొగ్గు!

న్యూఢిల్లీ : భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఇప్పట్లో కీలక వడ్డీ రేట్లు పెంచే సూచనలు కనిపించడం లేదు. ఈ నెల 8న ప్రకటించే ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానంలోనూ ఆర్‌బీఐ కీలకమైన రెపో, రివర్స్‌ రెపో రేట్లు యథాతథంగా కొనసాగిస్తుందని ఆర్థిక నిపుణుల అంచనా. ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశం లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.07 శాతంగా నమోదై ఎనిమిది నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. ప్రభుత్వం నిర్ధేశించిన దానికంటే ఇది ఎక్కువ. దీంతో ఏప్రిల్‌ నెల ద్రవ్య, పరపతి విధానంలో ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) పావు శాతం నుంచి అర శాతం వరకు వడ్డీ రేటు పెంచే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనాకు వచ్చాయి. కాగా కొవిడ్‌ కష్టాల నుంచి భారత ఆర్థిక వ్యవస్థ ఇపుడిప్పుడే గాడిన పడుతోంది. ఈ స్థితిలో వడ్డీ రేట్లు పెంచితే, అందుకు బ్రేక్‌ పడుతుందని నిపుణుల అంచనా. దీంతో వృద్ధికి చేయూతనిచ్చేందుకు రేట్ల పెంపునకు వెళ్లకపోవచ్చని  నిపుణులు భావిస్తున్నారు. పైగా ప్రస్తుత ద్రవ్యోల్బణానికి చమురు సెగ ప్రధాన కారణం. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం చల్లారితే బ్యారల్‌ చమురు ధర మళ్లీ 100 డాలర్ల దిగువకు వస్తుందని అంచనా. 

జూన్‌ నుంచి వడ్డింపు!

అయితే ఈ ఏడాది జూన్‌ నుంచి ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపునకు దిగుతుందని ఫిక్కీ అంచనా వేస్తోంది. 2023 మార్చిలోగా కీలకమైన రెపో రేటు అర శాతం నుంచి ముప్పావు శాతం పెంచే అవకాశం ఉందని అంచనా వేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 6 నుంచి 7.8 శాతం మధ్య ఉండే అవకాశం ఉందని పేర్కొంది. 

కామెంటరీపైనే ఆసక్తి: శుక్రవారం ప్రకటించే ద్రవ్య, పరపతి విధానంలో ద్రవ్యోల్బణంపై ఆర్‌బీఐ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందా? అని మార్కెట్‌ వర్గాలు ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. జూన్‌ నుంచి వడ్డీ రేట్ల పెంపు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ద్రవ్యోల్బణం, దాన్ని కట్టడి చేసేందుకు అనుసరించే విధానాలపైనా ఆర్‌బీఐ ఏమి చెబుతుందా? అని మార్కెట్‌ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. 


Updated Date - 2022-04-04T07:59:40+05:30 IST