వెండి సూర్యప్రభపైనే ఈసారి మలయప్ప దర్శనం

ABN , First Publish Date - 2020-09-22T11:06:44+05:30 IST

ఒకనాటి సంప్రదాయమైన వెండి సూర్యప్రభ వాహనంపైనే ఈ ఏడు బ్రహ్మోత్సవాల్లో మలయప్పస్వామి దర్శనమివ్వనున్నారు. క

వెండి సూర్యప్రభపైనే ఈసారి మలయప్ప దర్శనం

తిరుమల,సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఒకనాటి సంప్రదాయమైన వెండి సూర్యప్రభ వాహనంపైనే ఈ ఏడు బ్రహ్మోత్సవాల్లో మలయప్పస్వామి దర్శనమివ్వనున్నారు. కరోనా ప్రభావంతో ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆలయం వెలుపల ఉండే వైభవోత్సవ మండపం నుంచి ఇప్పటికే మెరుగులు దిద్దిన వాహనాలను ఆలయంలోని కల్యాణోత్సవ మండపానికి తీసుకువచ్చి ఏకాంతంగా వాహనసేవలను నిర్వహిస్తున్నారు.


అయితే అత్యంత భారీ పరిమాణం, బరువుతో కూడిన బంగారు సూర్యప్రభ వాహనాన్ని ఆలయంలోకి తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో పూర్వం వినియోగించిన వెండి సూర్యప్రభ వాహనంపైనే టీటీడీ ఆధారపడాల్సి వచ్చింది. తక్కువ పరిమాణంతో ఉండే ఈ వాహనాన్ని ఆలయంలోకి తీసుకెళ్లడానికి అనువుగా ఉంటుందని అర్చకులు, అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.


పూర్వకాలంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వాడే వాహనాలు వెండివే ఉండేవి. పగలు సూర్యకాంతి, రాత్రి చంద్రుడి వెలుగుల్లో వెండి వాహనాలు సౌందర్యవంతంగా మెరుస్తూ ఉత్సవమూర్తులతో దర్శనమిచ్చేవి. బ్రహ్మోత్సవాలకు ముందు ఈ వెండివాహనాలకు మెరుగులు దిద్దేవారు. కాలానుగుణంగా తిరుమల క్షేత్రానికి భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా భారీగా పెరుగుతూ వచ్చింది. ఇందులో భాగంగానే నెమ్మదిగా వెండివాహనాల స్థానంలో బంగారు వాహనాలు వినియోగంలోకి వచ్చాయి.టీటీడీ చైర్మన్‌ డీకే ఆదికేశవులు హయాంలో శ్రీవారికి భారీ పరిమాణం, బరువుతో కూడిన బంగారు సూర్యప్రభవాహనం విరాళంగా అందింది.


ఆప్పటి నుంచి దీన్నే ఉత్సవాలకు వినియోగిస్తున్నారు. ఆనాటి నుంచి కనుమరుగైన వెండిసూర్యప్రభ వాహనం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇన్నాళ్లూ గోవిందరాజస్వామి ఆలయంలో ఉన్న ఈ వాహనాన్ని తిరుమలకు తీసుకువచ్చారు. 25వ తేదీ ఉదయం ఈ వాహనంపై వెంకన్న కొలువుదీరనున్నారు. 

Updated Date - 2020-09-22T11:06:44+05:30 IST