ఈ పీఆర్సీ మాకొద్దు
ABN , First Publish Date - 2022-01-19T05:03:59+05:30 IST
ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని తాము అంగీకరించడం లేదని, ఇది తమకు నష్టం కలిగిస్తుందని ఫ్యాఫ్టో కన్వీనర్ జవహర్నాయక్, కో కన్వీనర్ కిషోర్ విమర్శించారు.
నల్లబాడ్జీలతో ఉద్యోగ సంఘాల నాయకుల నిరసన
ఆత్మకూరురూరల్, జనవరి 18: ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని తాము అంగీకరించడం లేదని, ఇది తమకు నష్టం కలిగిస్తుందని ఫ్యాఫ్టో కన్వీనర్ జవహర్నాయక్, కో కన్వీనర్ కిషోర్ విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఆత్మకూరు మండలంలోని వివిధ పాఠశాలల్లో భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. అలాగే పీఆర్సీ జీవోలను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అశుతోష్ మిశ్రా నివేదికను బహిర్గతం చేయకుండా చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఐఆర్కంటే తక్కువ ఫిట్మెంట్ను ప్రకటించడం అన్యాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు మధు, శేఖర్, వెంకటశేషయ్య, ఏసుదాసు, సుధాకర్, చిత్రలేఖిని, మాధురి, పద్మావతి, మహేశ్వరి పాల్గొన్నారు.
ఆత్మకూరు రూరల్ (వెలుగోడులో): ఉపాధ్యాయుల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం రివర్స్ పీఆర్సీని తాము అంగీకరించడం లేదని ఫ్యాఫ్టో నాయకులు నాగస్వామి నాయక్, సీనియర్ ఉపాధ్యాయుడు మగ్బుల్బాషా అన్నారు. మంగళవారం వెలుగోడులోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రభుత్వం ఇచ్చిన రివర్స్ పీఆర్సీ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, హెచఆర్ఏ స్లాబులు, సీపీఏ అలవెన్సులు యథాతధంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
బనగానపల్లె: బనగానపల్లె పట్టణంలోని తెలుగుపేట ప్రాథమిక పాఠశాలలో మంగళవారం పీఆర్సీకి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు జీవో ప్రతులను దహనం చేశారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి సత్యప్రకాశ, మండల అధ్యక్షుడు ప్రతాప్, దస్తగిరి ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మురళి, సత్య నారాయణస్వామి, కృష్ణయ్య, షరీఫ్, షర్మిలాబేగం తదితరులు పాల్గొన్నారు.