ఈ కేవైసీ అంతంతే....!
ABN , First Publish Date - 2022-05-15T05:57:44+05:30 IST
రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.6 వేలను మూడు విడతల్లో అందిస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో నమోదైన రైతులు తప్పనిసరిగా ఈ నెలాఖరులోగా ఈ కేవైసీని చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించింది.
- ఆధార్కు ఫోన్ నెంబర్ లింక్ లేకపోవడంతో సమస్యలు
- అంతంత మాత్రంగానే ఈ కేవైసీ నమోదు
- ఈనెల 31తో ముగియనున్న గడువు
- క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తేనే ఉపయోగం
కామారెడ్డి, మే 14: రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.6 వేలను మూడు విడతల్లో అందిస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో నమోదైన రైతులు తప్పనిసరిగా ఈ నెలాఖరులోగా ఈ కేవైసీని చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో బోగస్ పేర్లను లబ్ధిదారులుగా నమోదు చేసుకుని గత సీజన్లలో నిధులను కాజేసిన వైనాన్ని కేంద్రం గుర్తించగా.. ఈ సీజన్లో అర్హులను గుర్తించేందుకు ఈ కేవైసీని తప్పనిసరి చేసింది. కాగా గడువు ఈనెల 31 వరకే ముగుస్తున్నా జిల్లాలో ఈ కేవైసీ నామ మాత్రంగా సాగుతుంది. ఈ కేవైసీని పూర్తి చేసిన రైతులకు మాత్రం ప్రస్తుతం రూ.2వేల చొప్పున చెల్లింపులు చేయాలని లేదా నమోదు పూర్తి కాకుంటే ఈ సీజన్ నుంచి నిధులను నిలిపి వేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.
అనుసంధానం ఇలా..
రైతులు ముందుగా పీఎం కిసాన్ పథకం వివరాలిచ్చిన తమ బ్యాంకు ఖాతాకు ఆధార్కార్డును అనుసంధానించుకోవాలి. ఈ తర్వాత ఆధార్కార్డుకు ఫోన్ నెంబర్ను అనుసంఽధానించాలి. అనంతరం పీఎంకిసాన్ పోర్టల్లో ఆధార్ ఆధారితంగా ఈ కేవైసీ చేస్తునప్పుడు ఫోన్ నెంబర్కు వచ్చే ఓటీపీ సంఖ్యను తిరిగి నమోదు చేస్తేనే ఈ కేవైసీ పూర్తవుతుంది. సెల్ఫోన్లో పీఎం కిసాన్ యాప్ ద్వారా లేదా కంప్యూటర్లో పోర్టల్ ద్వారా రైతులే ఈ కేవైసీని చేసుకోవచ్చు. లేదా కామన్సర్వీస్ సెంటర్లలో సైతం ఈ కేవైసీని పూర్తి చేసిన అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు విడుదల చేస్తారు. బోగస్ రైతులు జాబితా నుచి తొలగించబడతారు. 2018లో పథకం ప్రారంభించిన దగ్గర నుంచి 10 విడతలుగా నిధులను విడుదల చేయగా ప్రస్తుతం ఏప్రిల్లోనే 11వ విడతకు సంబంధించి ఈ దఫా నిధులు ఇవ్వాల్సి ఉండగా ఈ కేవైసీతో ఈ నెలాఖరులోగా లేదా జూన్ మొదటివారంలో నిధులు విడుదల చేసే అవకాశం ఉంది.
అవగాహన కల్పించరూ..
ఆధార్ అనుసంధానం, ఈ కేవైసీ చేసుకోవడం గురించి చాలామంది రైతులకు తెలియదు. ఇవి చేసుకోలేకనే ఎంతో మంది రైతులు ఇప్పటికీ ఎన్నో ప్రభుత్వ పథకాలకు నోచుకోలేకపోతున్నారు. తాజాగా ఈ కేవైసీ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. మీసేవ కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు, ఆధార్కు ఫోన్ నెంబర్ లింకు లేకపోవడం వంటి కారణాలతో మళ్లీమళ్లీ తిరగాల్సి వస్తోంది. ప్రస్తుతం వ్యవసాయాధికారులు ధాన్యం నాణ్యత ధ్రువీకరణ పనుల్లో నిమగ్నమై ఉండగా ఈ కేవైసీని పూర్తి చేయించేందుకు రైతులకు అవగాహన కల్పించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేవైసీని పూర్తి చేయని రైతులకు నిధులు నిలిచిపోనుందున రైతులందరూ ఈ కేవైసీని పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
31లోగా నమోదు చేసుకోవాలి
- భాగ్యలక్ష్మీ, డీఏవో, కామారెడ్డి
పీఎం కిసాన్ సమ్మాన్నిధి పథకం కోసం రైతులు ఈనెల 31లోగా నమోదు చేసుకోవాలి. ఇప్పటి వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ కేవైసీపై అవగాహన కల్పిస్తున్నాం. ఆయా మండలాల్లో ఏఈవోలు నమోదును వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పీఎం కిసాన్ లబ్ధిదారులే కాకుండా మిగిలిన రైతులు కూడా ఈ కేవైసీ చేసుకుంటే మంచిది.