ఈ ఘటన గురించి తెలిశాక కూడా మాస్క్ పెట్టుకోకపోతే...

ABN , First Publish Date - 2020-07-31T02:16:01+05:30 IST

కరోనా వేళ వైరస్ ఒకరి నుంచి మరొకరికి విస్తరించకుండా మాస్క్ పెట్టుకోవడం ఎంత ముఖ్యమో...

ఈ ఘటన గురించి తెలిశాక కూడా మాస్క్ పెట్టుకోకపోతే...

అలప్పుజ్హ: కరోనా వేళ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా మాస్క్ పెట్టుకోవడం ఎంత ముఖ్యమో కళ్లకు కట్టే ఘటన ఇది. కరోనాను మాస్క్‌లు అడ్డుకోలేవని కొన్ని వాదనలు ఉన్నప్పటికీ మాస్క్‌ల వల్ల దాదాపు 2,123 మంది కరోనా సోకకుండా బయటపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళలోని అలప్పుజ్హ జిల్లాలో జానకీయ ల్యాబొరేటరీ ఎంతో పేరున్న ల్యాబ్.


చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలామంది పలు రకాల అనారోగ్య సమస్యలతో టెస్టులు చేయించుకునేందుకు ఈ ల్యాబ్‌కు వస్తుంటారు. నిత్యం జనంతో కిటకిటలాడే ఈ ల్యాబ్‌లో జూలై 16న ల్యాబ్ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అదే.. రోజు మరో ముగ్గురు సిబ్బందికి కూడా కరోనా సోకింది. 


ల్యాబ్‌కు ఎక్కువగా వృద్ధులు, అనారోగ్య సమ్యసలతో వెళ్లే వారు ఉంటారని భావించిన యాజమాన్యం అప్రమత్తమైంది. జూలై 2 నుంచి 15 వరకూ ల్యాబ్‌కు వచ్చివెళ్లిన వారి జాబితాను తీసింది. మొత్తం 2,123 మంది ల్యాబ్‌కు వచ్చి వెళ్లినట్లు గుర్తించింది. పొరపాటున.. వీరిలో 10 శాతం మందికి కరోనా సోకినా ఆ ప్రాంతంలో సామాజిక వ్యాప్తి భారీగా ఉండేది. ల్యాబ్‌లో కరోనా వ్యాప్తి జరిగిన వెంటనే.. ల్యాబ్‌ను మూసివేసిన యాజమాన్యం ల్యాబ్‌కు వచ్చి వెళ్లిన 2,123 మంది సమాచారాన్ని వైద్య అధికారులకు ఇచ్చింది.


దీంతో.. అప్రమత్తమైన అధికారులు వారందరూ 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌ పాటించేలా చర్యలు తీసుకున్నారు. బుధవారం వీరందరి హోం క్వారంటైన్ గడువు ముగిసింది. ఏ ఒక్కరికీ కరోనా లక్షణాలు కనిపించలేదని, అందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్య శాఖ అధికారులు చెప్పడం శుభపరిణామం. కరోనా సోకిన ఆ ముగ్గురూ, ఆ ల్యాబ్‌కు వెళ్లిన వారు మాస్క్‌ను ధరించడం వల్ల పెను ప్రమాదమే తప్పింది.

Updated Date - 2020-07-31T02:16:01+05:30 IST