పేద, మధ్య తరగతి వర్గాలకు మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టిన బడ్జెట్ : మోదీ

ABN , First Publish Date - 2022-02-02T18:24:00+05:30 IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం

పేద, మధ్య తరగతి వర్గాలకు మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టిన బడ్జెట్ : మోదీ

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రధానంగా పేదలు, మధ్య తరగతి వర్గాలు, యువతకు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బుధవారం ఆయన బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి వర్చువల్ విధానంలో మాట్లాడారు. 


ఆత్మనిర్భర్ అర్థ వ్యవస్థ శీర్షికతో జరిగిన బీజేపీ కార్యకర్తల వర్చువల్ సమావేశంలో మోదీ మాట్లాడుతూ, తన ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన సంతృప్తికరంగా జరగాలనే లక్ష్యంతో పని చేస్తోందని చెప్పారు. ఈ బడ్జెట్ ప్రధానంగా పేదలు, మధ్య తరగతి వర్గాలు, యువతపై దృష్టి పెట్టిందన్నారు. ఈ వర్గాలకు మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు చెప్పారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత సరికొత్త ప్రపంచం ఆవిర్భవిస్తోందన్నారు. దీనికి సంబంధించిన ప్రారంభ సూచనలు ఇప్పటికే కనిపిస్తున్నాయన్నారు. నేడు భారత దేశం పట్ల ప్రపంచం చూసే దృక్పథం చాలా మారిందన్నారు. బలమైన భారత దేశాన్ని చూడాలని ప్రపంచం కోరుకుంటోందన్నారు. భారత దేశం పట్ల ప్రపంచ దృక్పథం మారినందువల్ల మన ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడం ద్వారా మన దేశాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్ళడం మనకు తప్పనిసరి అని చెప్పారు. 


వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరించడంపై భారత ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ఆర్గానిక్ సాగుపై దృష్టి సారించినట్లు తెలిపారు. దీనివల్ల వ్యవసాయం మరింత ఆకర్షణీయంగా మారుతుందన్నారు. రైతులకు సరసమైన ధరలకు కిసాన్ డ్రోన్లను, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేస్తామని చెప్పారు. 


దేశ సరిహద్దుల్లోని గ్రామాల అభివృద్ధిపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. సరిహద్దుల్లోని గ్రామాల్లో ఉన్న పాఠశాలల్లో ఎన్‌సీసీ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. 


Updated Date - 2022-02-02T18:24:00+05:30 IST