అంగ రంగుల వైభవంగా..
ABN , First Publish Date - 2022-01-21T06:08:53+05:30 IST
అంగ రంగుల వైభవంగా..
ఘనంగా తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవం
పెనుగంచిప్రోలు, జనవరి 20 : పెనుగంచిప్రోలులోని గోపయ్య సమేత తిరుపతమ్మ, ఇతర పరివార దేవతల రంగుల మహోత్సవం గురువారం వైభవంగా ప్రారంభమైంది. ఆలయంలోని దేవతామూర్తులకు గురువారం తెల్లవారుజామున చైర్మన్ ఇంజం కేశవరావు, ఇన్చార్జి ఈవో భ్రమరాంబ పూజలు నిర్వహించారు. అనంతరం రజకులు అమ్మవారు, గోపయ్య, ఇతర పరివార దేవతల విగ్రహాలను భుజాలపైకెత్తుకుని పోలీస్స్టేషన్ సెంటర్ వరకు తీసుకొచ్చారు. అక్కడ జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్, పెనుగంచిప్రోలు ఎస్సై హరిప్రసాద్ అమ్మవారికి స్వాగతం పలికారు. తర్వాత దేవతామూర్తులను పీఠాలపై అధిష్టింపజేసి గ్రామంలో రంగుల మండపం వరకు తీసుకెళ్లారు. అంతకుముందు ఆలయంలోని దేవతామూర్తులకు ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వి.నరసింహారావు, ఎంపీపీ మార్కపూడి గాంధీ, సర్పంచ్ వేల్పుల పద్మకుమారి, దేవస్థానం ఈఈ వైకుంఠరావు, మాజీ ఎంపీపీ గూడపాటి శ్రీనివాసరావు, వేల్పుల రవికుమార్, కాకాని హరి, ఏరువ వెంకటేశ్వరరావు, నల్లపునేని వెంకట నారాయణ, బత్తుల రామారావు, కార్యదర్శి నల్లాని నరసింహారావు, సూరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రంగుల మహోత్సవ ఊరేగింపులో కళాకారుల కోలాటం, కనక తప్పెట్లు, శక్తి వేషాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.