Thailand: థాయ్‌లాండ్‌లో అమానుష ఘటన.. సామూహిక కాల్పుల్లో 34 మంది మృతి

ABN , First Publish Date - 2022-10-06T21:02:06+05:30 IST

థాయ్‌లాండ్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ డే కేర్ సెంటర్‌లో గన్‌మెన్ జరిపిన కాల్పుల్లో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన 34 మందిలో..

Thailand: థాయ్‌లాండ్‌లో అమానుష ఘటన.. సామూహిక కాల్పుల్లో 34 మంది మృతి

థాయ్‌లాండ్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ డే కేర్ సెంటర్‌లో ఓ వ్యక్తి జరిపిన తుపాకీ కాల్పుల్లో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన 34 మందిలో 22 మంది చిన్నారులే కావడం శోచనీయం. ఈ కాల్పులు తర్వాత తనను తాను కాల్చుకుని ఆ 34 ఏళ్ల వ్యక్తి కూడా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ కాల్పులకు తెగబడ్డ వ్యక్తి ఒక మాజీ పోలీసు అని తెలిసింది. ఈ కాల్పుల్లో సదరు వ్యక్తి తన భార్యాబిడ్డ ప్రాణం కూడా తీయడం అతని క్రూర మనస్తత్వానికి అద్దం పట్టింది. గతేడాదే పోలీసు విధుల నుంచి అతను తప్పుకున్నట్లు తెలిసింది. ఈ కాల్పుల్లో మరో 12 మంది కూడా గాయపడ్డారు. థాయ్‌లాండ్‌లోని Nongbua Lamphu ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆ తుపాకీ కలిగిన వ్యక్తి పేరు Panya Khamrab.


 

డ్రగ్స్ తీసుకుంటూ, మత్తుకు బానిసయ్యాడనే కారణంగా పోలీసు ఉద్యోగం నుంచి అతనిని తొలగించినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో మరో విషాదం కూడా చోటుచేసుకుంది. కాల్పుల్లో చనిపోయిన వారిలో ఎనిమిది నెలల గర్భిణి కూడా ఉంది. ఆమె ఆ డే కేర్ సెంటర్‌లో టీచర్‌గా చేస్తోంది. తొలుత టపాసుల మోత అని అంతా అనుకున్నారు. ఆ తర్వాత కాల్పుల మోతతో ఆ ప్రాంతం దద్ధరిల్లింది. ఇలాంటి మారణహోమం జరగడంతో థాయ్‌లాండ్ ఉలిక్కిపడింది.

Updated Date - 2022-10-06T21:02:06+05:30 IST