థర్డ్ పార్టీ మోటార్ బీమా మరింత ప్రియం
ABN , First Publish Date - 2022-05-27T06:09:25+05:30 IST
హనదారులకు థర్డ్ పార్టీ బీమా మరింత భారం కానుంది. ఈ ఏడాది జూన్ 1 నుంచి పలు విభాగాల వాహనాల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం చార్జీలు పెరగనున్నాయి.
జూన్ 1 నుంచి పెరగనున్న ప్రీమియం
న్యూఢిల్లీ: వాహనదారులకు థర్డ్ పార్టీ బీమా మరింత భారం కానుంది. ఈ ఏడాది జూన్ 1 నుంచి పలు విభాగాల వాహనాల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం చార్జీలు పెరగనున్నాయి. చివరిసారిగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో థర్డ్ పార్టీ ప్రీమియం పెరిగింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో రెండేళ్ల పాటు యథాతథంగా కొనసాగిన ప్రీమియం ఈ జూన్ నుంచి మరింత ప్రియం కానుంది. ఇదివరకు థర్డ్ పార్టీ ప్రీమియం రేట్లను భారత బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్డీఏఐ) ప్రకటించేది. తొలిసారిగా కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ఐఆర్డీఏఐతో సంప్రదించి ప్రీమియం రేట్ల ను ప్రకటించింది. ప్రీమియంపై హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు 7.5 శాతం, ఎలక్ట్రిక్ వాహనాలకు 15 శాతం రాయితీకి అనుమతిచ్చింది. అలాగే, విద్యా సంస్థల బస్సులకు ప్రీమియంలో 15 శాతం, వింటేజ్ కార్లుగా రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రైవేట్ కార్లకు 50 శాతం డిస్కౌంట్కు అనుమతిచ్చింది. వాహనదారులు థర్డ్ పార్టీ బీమా కవరేజీ కొనుగోలు చేయడం తప్పనిసరి. రోడ్డు ప్రమాదాల్లో ఏదేని వాహనం వల్ల థర్డ్ పార్టీకి కలిగే నష్టానికి బీమా కవరేజీ కల్పించడమే ఈ పథకం ఉద్దేశం.