అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

ABN , First Publish Date - 2021-05-06T05:25:49+05:30 IST

గంగవరం మండలం గండ్రాజుపల్లె వద్ద చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి, రూ.90లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పలమనేరు డీఎస్పీ గంగయ్య తెలిపారు

అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు
నిందితులను, నగదును చూపుతున్న డీఎస్పీ గంగయ్య

రూ.90 లక్షల నగదు స్వాధీనం 


గంగవరం, మే 5 : గంగవరం మండలం గండ్రాజుపల్లె వద్ద చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి, రూ.90లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పలమనేరు డీఎస్పీ గంగయ్య తెలిపారు. బుధవారం గంగవరం సర్కిల్‌ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గండ్రాజుపల్లె వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా బెంగళూరు నుంచి చిత్తూరు వైపు వెళుతున్న మారుతీ కారులో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. కారును సోదా చేయగా రూ.90లక్షలు ఉన్నట్లు గుర్తించాం. వీరిని విచారించగా కారులో ప్రయాణిస్తున్న సుబంకర్‌షిల్‌(నదియా, వెస్ట్‌బెంగాల్‌), అతడి స్నేహితుడు రాజు దేవనాథ్‌ కలసి గతంలో బెంగళూరులో పలుచోరీలకు పాల్పడినట్లు తెలిసింది. ప్రస్తుతం సుబంకర్‌షిల్‌, మరో స్నేహితుడు సంజూసాహు కలసి రెండవ తేది అర్దరాత్రి బెంగళూరులోని ఎంహెచ్‌ఆర్‌ లేవుట్‌లో డూప్లెక్స్‌ ఇంట్లో చోరీచేసిన రూ. 90 లక్షల నగదును తరలిస్తున్నట్లు విచారణలో తెలిసిందని డీఎస్పీ పేర్కొన్నారు, బెంగళూరులో కారును అద్దెకు తీసుకొని తన సొంత గ్రామాలకు వెళుతున్నట్లు కారు డ్రైవర్‌కు చెప్పారని, నగదు తీసుకొని వస్తుండగా ఎస్‌ఐ సుధాకర్‌ రెడ్డి పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారన్నారు. బెంగళూరులో చోరీకి గురైన రూ.90లక్షలు స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరచినట్లు డీఎస్పీ తెలిపారు.

Updated Date - 2021-05-06T05:25:49+05:30 IST