ఆ ముగ్గురూ కరోనాతోనే మృతిచెందారు.. తేల్చిచెప్పిన వైద్యులు
ABN , First Publish Date - 2020-07-04T21:18:38+05:30 IST
అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ముగ్గురు మృతి చెందడంతో ఆ మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఏలూరు(ఆంధ్రజ్యోతి) : అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ముగ్గురు మృతి చెందడంతో ఆ మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ముగ్గురూ కరోనా వ్యాధితోనే మృతి చెందినట్లుగా గుర్తించారు. గణపవరం ప్రాంతం నుంచి ఒక వ్యక్తి, ఆచంట ప్రాంతం నుంచి మరో వ్యక్తి ఏలూరు ప్రాంతానికి చెందిన ఒక వృద్ధురాలు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆ మృతదేహాలను ఆసుపత్రి మార్చురీలోనే గురువారం రాత్రి నుంచి ఉంచారు. మూడు మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించారు. మూడు మృతదేహాలకు పాజిటివ్ ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైంది. దీంతో మృతదేహాలను బంధువులకు ఇవ్వకుండా మార్చురీలో ఉంచారు. శనివారం ఉదయం ప్రత్యేక జాగ్రత్తతో ఆసుపత్రి సిబ్బంది తీసుకువెళ్ళి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
దుంపగడపలో..
ఆకివీడు మండలం దుంపగడపలో మృతి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో కలకలం రేగింది. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న అతడిని గురువారం భీమవరం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కొవిడ్ పరీక్ష చేయించుకుని రావాలని సూచించడంతో ఏలూరు తరలించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు ధ్రువీకరించారని కుటుంబసభ్యులు తెలిపారు. శుక్రవారం ఉదయం పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యిందని వైద్య సిబ్బంది తెలిపారు. ఫలితం వచ్చేలోపు అంత్యక్రియలు నిర్వహించడంతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది.